మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
మరో 3 నెలల్లో విశాఖపట్నం రాజధాని అవబోతోందని, ఉత్తరాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, విశాఖపట్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోను రాజధానిని చేసి తీరుతామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే తెలుగుదేశం పార్టీ అమరావతిని రాజధానిగా ప్రకటించిందని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బొత్స ప్రకటించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన జరగనున్నట్లు వెల్లడించారు. విజయనగరంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు.
ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కాకుండా శాసన రాజధానిగా చేస్తూ మూడు రాజధానుల నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసనరాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేశారు. దీనిపై అమరావతి రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు 1100 రోజులకు పైగా వారు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేస్తున్నారు. ఇందులో భాగంగా న్యాయస్థానం టు దేవస్థానం, అసెంబ్లీ టు అరసవెల్లి, చలో ఢిల్లీ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి.
మూడు రాజధానులకు సంబంధించి మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా వ్యాఖ్యానించారు. విశాఖను రాజధానిగా చేయని పక్షంలో ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దీన్ని ఖండించారు. ముందుగా రాష్ట్రం చేయాల్సిన పక్షంలో రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా ఉత్తరాంధ్రను, రాయలసీమను ప్రత్యేక రాష్ట్రాలుగా ప్రకటించాలని ఇరు ప్రాంతాలకు చెందిన రాజకీయ నేతలు వాదులాడుకుంటున్నారు.