41వేల కోట్ల రూపాయల అవకతవకలా ... పయ్యావుల ఆరోపణలు హాస్యాస్పదం : మంత్రి బుగ్గన ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టిడిపి నేతలు చేస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిడిపి సీనియర్ నాయకుడు, పిఏసి చైర్మన్ పయ్యావుల కేశవ్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభిప్రాయపడ్డారు. ఈరోజు తాడేపల్లి వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై అనవసరమైన అనుమానాలు రేకెత్తిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
ఏపీ ఆర్ధిక పరిస్థితిపై గవర్నర్ కు ఫిర్యాదు.. సంచలన ఆరోపణలు చేసిన పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్
ఆడిటింగ్ సంస్థ వేసిన ప్రశ్నలతో విమర్శలా ?
కేవలం ఆడిటింగ్ సంస్థ ప్రశ్నల ఆధారంగా చేసుకొని, ఏమో తప్పు జరిగినట్లు భూత కల్పనలు కల్పిస్తూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆడిట్ చేసే క్రమంలో పలు రకాల ప్రశ్నలను, ఆడిటింగ్ సంస్థ వేస్తుందని, ఆ ప్రశ్నల ఆధారంగా చేసుకొని విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆడిటింగ్ వ్యవహారాల్లో తప్పిదాలు జరిగాయని పీఏసీ చైర్మన్ తో అనుమానాలు ఉంటే ప్రభుత్వం నుండి వివరణ తీసుకోవచ్చని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.
సందేహాలుంటే వివరణ తీసుకోవచ్చు
సందేహాలుంటే సమావేశం ఏర్పాటు చేసుకుని సందేహ నివృత్తి చేసుకుంటే సరిపోతుందని సూచించిన ఆయన, లేఖలు రాసి రచ్చ చేయడం వల్ల సాధించే ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదని విమర్శించారు. 41 వేల కోట్ల రూపాయలకు సంబంధించి బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్న మంత్రి బుగ్గన 41 వేల కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తి లెక్కలు ఉన్నాయని, ప్రతిపక్షాలు నిజం తెలుసుకొని మాట్లాడడం మంచిదని హితవు పలికారు.
టీడీపీ నేతలు చేసింది అనవసరపు రాద్ధాంతం
41 వేల కోట్ల రూపాయలు అవకతవకలు జరిగితే వ్యవస్థను చూసుకోవా అంటూ ప్రశ్నించినా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కావాలని టిడిపి నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. సిఎఫ్ఎంఎస్ వచ్చిన తర్వాత ట్రెజరీ ద్వారా వ్యవస్థ నడవడం లేదని, చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే సిఎఫ్ఎంఎస్ ను ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టారని మంత్రి బుగ్గన మండిపడ్డారు. సిఎఫ్ఎంఎస్ ప్రోగ్రామింగ్లో లోపాలున్నాయని పేర్కొన్న మంత్రి బుగ్గన 10,895 కోట్ల బిల్లులు సిఎఫ్ఎంఎస్ లోపంవల్ల పిడి అకౌంట్ నుంచి వెనక్కి వచ్చాయని పేర్కొన్నారు.
తెలంగాణాలో ఉన్న ఆస్తులపై ఏపీ అప్పులెలా తెస్తుంది ?
రాష్ట్ర ఆర్ధిక అంశాలపై యనమల మాట్లాడతారు. ఈసారి పయ్యావుల ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్న బుగ్గన రాజేంద్రనాథ్ గవర్నర్ కు లేఖ రాయడం, మీడియా సమావేశాలు పెట్టడం ఇలా కావాలని రచ్చ చేయడం దేనికో అర్థం కావడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆస్తులపై ఏపీ అప్పు తెస్తుందంటూ ఆరోపణలు చేయడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆస్తులపై మనకెలా అప్పిస్తారు అంటూ ప్రశ్నించిన మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు రెండు రాష్ట్రాలు కడుతున్నాయి అంటూ క్లారిటీ ఇచ్చారు.
పథకం ప్రకారం అప్రదిష్ట పాలు చేస్తున్న టీడీపీ నాయకులు
పథకం ప్రకారం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని కుట్ర చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోని చోట, అవకతవకలు చోటుచేసుకున్నాయని లేనిపోనివి క్రియేట్ చేస్తున్నారంటూ మంత్రి బుగ్గన ధ్వజమెత్తారు.టీడీపీ నాయకులకు ఇలా ప్రతీ విషయంపై రాద్దాంతం చెయ్యటం పరిపాటిగా మారిందని బుగ్గన రాజేంద్రనాథ్ అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై పయ్యావుల కేశవ్ గవర్నర్ కు లేఖ
రెండేళ్లలో ఆర్థికశాఖలో జమా, ఖర్చుల లెక్కలు అస్తవ్యస్తంగా ఉన్నాయని పయ్యావుల కేశవ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు రెండేళ్లకు సంబంధించిన ఆర్థికశాఖ రికార్డులను స్పెషల్ గా ఆడిటింగ్ చేయించాలని ఆయన గవర్నర్ ను కోరారు. 40 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలలో, అకౌంటింగ్ ప్రొసీజర్ లలో తప్పిదాలు జరిగాయని పయ్యావుల కేశవ్ ఆరోపణలు గుప్పించారు.