అందంగా ఉంటాడని జగన్కు అహంకారం, అందరూ చూశారు: ఏకేసిన దేవినేని
అందంగా ఉంటానని, చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతానని ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి బాగా అహంకారం అని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విరుచుకుపడ్డారు.
విజయవాడ: అందంగా ఉంటానని, చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి బాగా అహంకారం అని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సోమవారం విరుచుకుపడ్డారు.
బాబు రూ.100 లక్షల కోట్ల టార్గెట్: ఆ రాక్షసుడిని అడ్డుకోకుంటే.., 'సాక్షి'కి చెక్!
ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ నేత నారా లోకేష్, రాజధాని అంశాలపై జగన్ పదేపదే విమర్శలు చేయడాన్ని దేవినేని తప్పుబట్టారు. జగన్ను ఏకిపారేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకే జగన్ సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు.
జైలుకు వెళ్లి వచ్చినా జగన్లో మార్పు రాలేదన్నారు. 11 సీబీఐ కేసులలో ఏ-1గా ఉన్న వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా విడ్డూరమన్నారు. విశాఖ విమానాశ్రయంలో జగన్ ప్రవర్తనను అందరూ చూశారన్నారు.
పెట్టుబడులు రాకుండా కుట్ర
రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్ర చేశారని ఆరోపించారు. జగన్ ఏపీ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆయనకు అభివృద్ధి ఇష్టం లేదన్నారు. జగన్ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దన్నారు. అవినీతి సొమ్ముతో వచ్చిన డబ్బుతో జగన్ సమావేశాలు పెడుతున్నారని ఆరోపించారు.
అవినీతి కేసులతో విమర్శలా
ఎన్నో అవినీతి కేసులున్న జగన్ తమని విమర్శిస్తున్నారన్నారు. జగన్ అసత్యప్రచారం చేస్తున్నారని, రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేక తట్టుకోలేక ప్రాజెక్టులని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
పోలవరంకు అడ్డంకులు
పోలవరం ప్రాజెక్టుకి జగన్ అడ్డంకులు సృష్టిస్తున్నారని, రైతులతో కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాను ప్రజలు ఆయనకు ఇస్తే అందుకు తగ్గట్లు జగన్ వ్యవహరించడం లేదన్నారు.
రైతులను రెచ్చకొట్టి..
రైతులను రెచ్చగొడుతూ ఆనాడు కూడా పట్టిసీమకు అడ్డుపడ్డారని, ఇప్పుడు పట్టిసీమ ద్వారా ఎన్నో ఎకరాలకు నీరు అందుతోందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదన్నారు. జగన్లో అస్సలు మార్పు రావడం లేదన్నారు.
అందుకే టీడీపీలోకి
జగన్ తీరును చూసే ఆ పార్టీకి చెందిన నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పారు. జగన్లో ఉన్న అప్రజాస్వామిక తీరుని కట్టుబెట్టాలని, ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నాడని, వాటిని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.
టిడిపిని తిట్టడమే
ఎక్కడ సమావేశం పెట్టినా తమ ప్రభుత్వాన్ని అరగంట లేదా గంట తిట్టడం, సాక్షి మీడియాలో వాటిని చూపించడం రోజు ఇదే పని అయిపోతుందన్నారు. రైతుల పైన తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందన్నారు.