ఏ జగనన్న కాలనీలో తేల్చుకుందాం? పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు మంత్రి జోగి రమేష్ సవాల్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసిపికి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీ లతో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ఇక జగనన్న కాలనీల పేరుతో వైసీపీ నేతలు పెద్ద స్కామ్ చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని టిడిపి, జనసేన నేతలు అధికార వైసీపీ ని టార్గెట్ చేస్తున్నాయి. అయితే వైసీపీకి ప్రజల్లో వస్తున్న మద్దతు చూసి టీడీపీ, జనసేనలు దుష్ప్రచారం చేస్తున్నాయని వైసీపీ మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు.

జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్ళు పేరుతో జనసేన కార్యక్రమం
జగనన్న కాలనీల పేరుతో పేదవాడికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియ చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 12, 13, 14 తేదీలలో జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్ళు పేరుతో కార్యక్రమం జనసేన పార్టీ చేపడుతోంది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా జగనన్న కాలనీలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ మంత్రి జోగి రమేష్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు.

ఏ జగనన్న కాలనీకి రమ్మంటారు చెప్పండి? మంత్రి జోగి రమేష్
జగనన్న కాలనీలలో ఎక్కడా రూపాయి కూడా దుర్వినియోగం జరగలేదని మంత్రి జోగి రమేష్ తేల్చి చెప్పారు. దమ్ముంటే జనసేన, టిడిపిలు టైం చెప్తే తానే స్వయంగా చర్చకు వస్తానని జోగి రమేష్ సవాల్ విసిరారు. ఎక్కడ జగనన్న కాలనీ కి రమ్మని పిలిచినా అక్కడికి తాను వస్తానని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ఇప్పటం లో తాము ఒక ఇంటిని కూడా కూల్చ లేదని, రోడ్డు విస్తరణకు అడ్డొచ్చిన ప్రహరీ గోడలను మాత్రమే తొలగించామని మంత్రి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ , హీరోయిజం, విలనిజం ప్రజాస్వామ్యంలో పనికిరాని మనీ జోగి రమేష్ మండిపడ్డారు.

ప్రభుత్వం పై బురద చల్లాలని కొందరి యత్నం
వైసిపి ప్రభుత్వం మీద, పేదల ఇళ్ల నిర్మాణం పైన విపక్షాలు, కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కాచెల్లెళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని పేర్కొన్న ఆయన, ఫేస్ 1, ఫేస్ 2 కింద 21 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. పేదల ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నా ప్రభుత్వంపై బురద చల్లాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఇప్పటంలో సానుభూతి వద్దని పోస్టర్లు.. పవన్ కళ్యాణ్ కు మంత్రి చురకలు
మాకు ఎవరు సానుభూతి అక్కర్లేదని, మా ఇల్లు ఎవరూ కూల్చలేదని పోస్టర్లు వెలసినా, జనసేన అధినేత అవేవీ పట్టించుకోకుండా రాజకీయం చేయాలనుకున్నారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ఇప్పటం లో వెలసిన బోర్డులను మంత్రి జోగి రమేష్ ప్రస్తావించారు. ఎందుకు ఇలా డ్రామాలు చేస్తున్నారని, సానుభూతి కోసం మీరు ఎన్ని చేసినా ప్రజలు వైసీపీ వైపే ఉంటారని జోగి రమేష్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications