సంచలన కామెంట్స్ : హోదాతో నాకేం సంబంధమన్న కామినేని
విజయవాడ : ప్రత్యేక హోదా అంశం ఏపీలో ఇప్పుడో వాడి వేడి చర్చ. హోదా ఆకాంక్ష ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో.. పార్టీలన్నీ హోదాపై ఆచీ తూచీ మాట్లాడిన పరిస్థితి. అదే సమయంలో హోదా కోసం ఎవరి ప్రయత్నాల్లో మునిగిపోగా.. ముఖ్యంగా అధికార పార్టీ అయినా టీడీపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ పైనే భారమంతా.
ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు హోదాపై ప్రజల్లో నమ్మకం కల్పించాల్సింది పోయి తమకేం సంబంధం అన్నట్లుగా మాట్లాడితే ఎలా ఉంటుంది..? తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇలాంటి తరహా వ్యాఖ్యలే చేశారు. 'రాష్ట్రానికి హోదా వస్తుందా..! రాదా..! అన్నదానిపై తానేమి మాట్లాడేది లేదని, అసలు హోదాతో తనకేం సంబంధం' అంటూ సంచలన కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
విజయవాడలో మీడియాతో మాట్లాడిన కామినేని శ్రీనివాస్.. తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని, ప్రజలకు సేవ చేయడంపైనే తాను ఫోకస్ చేస్తున్నానని తెలిపారు. ప్రత్యేక హోదా అంశం సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యలే చూసుకుంటారని చెప్పారు. అయితే హోదాతో సంబంధం లేదంటూ మంత్రి కామినేని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేవిగానే కనిపిస్తున్నాయి.