విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలను వైసీపీ ఎప్పుడూ చెయ్యదు; చంద్రబాబుది తప్పుడు ప్రచారం: మంత్రి కన్నబాబు
ఏపీ మంత్రి కన్నబాబు ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటనపై స్పందించారు. ఇదే సమయంలో ఏపీ టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి కన్నబాబు ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటన దురదృష్టకరమైన సంఘటనగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి ఘటనలు ఎవరు చేసినా తప్పే అంటూ ఆయన మండిపడ్డారు. బాధ్యులపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం రచ్చ .. భగ్గుమంటున్న టీడీపీ, మండిపడిన నందమూరి రామకృష్ణ
ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై దర్యాప్తు కొనసాగుతుంది
ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. గతంలో విజయవాడ నడిబొడ్డులో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించారని గుర్తు చేశారు మంత్రి కన్నబాబు. విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలను వైసీపీ ఎప్పుడూ చేయదని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అంటే ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వాలి కానీ, తప్పుదారి పట్టించే ప్రయత్నం చెయ్యకూడదు అని మంత్రి కన్నబాబు మండిపడ్డారు.
వంగవీటి రాధా అంశాన్ని కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నారు
వంగవీటి రాధాపై రెక్కీ చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని విజయవాడ సీపీ చెప్పారని, కానీ చంద్రబాబు వంగవీటి రాధా అంశాన్ని కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నారు అంటూ మంత్రి కన్నబాబు ఆరోపణలు గుప్పించారు. ఎన్టీఆర్ అంటే తమకు అభిమానం ఉందని , ఆయనకు తాము సమున్నత గౌరవాన్ని ఇస్తున్నాము అంటూ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో కావాలని ప్రతీది రాజకీయం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆయన అన్నారు.
వరి పండించవద్దు అంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం
వైయస్ఆర్ రైతు భరోసాలో తొలుత 45 లక్షల మందికి రైతు భరోసా ప్రారంభించామని ఇప్పుడు 50.58 లక్షలకు పైగా రైతులకు రైతు భరోసా అందుతుందని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. బోర్ల కింద ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు పండించాలని ప్రభుత్వమే కోరుతుందని, కానీ ప్రభుత్వం వరి పండించవద్దు అని చెబుతున్నట్లుగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు కడుపు మంటతోనే ఇదంతా
ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబుకు ఉన్న కడుపు మంటతో ఇదంతా చేస్తున్నారంటూ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. బాబు కోసం కొన్ని పత్రికలు కూడా అదే పని చేస్తున్నాయి అంటూ విరుచుకుపడ్డారు. రైతులకు సేవ చేయడం కోసం సీఎం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నారని, వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కనిపిస్తోందని మంత్రి కన్నబాబు తెలిపారు.