జగన్ అడ్డుపడకుంటే: పత్తిపాటి ఆసక్తికరం, రాజధానిలో క్విడ్ ప్రోకో: వడ్డె
విజయవాడ: ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుపడకపోతే మేనిఫెస్టోలో చెప్పని అభివృద్ధి పనులు కూడా చేసేవాళ్లమని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనులకు జగన్ అడ్డుపడుతున్నారన్నారు. జగన్ తమ పనులకు అడ్డుపడకపోతే మేం చెప్పని పనులు కూడా చేసి చూపించే వాళ్లమన్నారు. ప్రజాస్వామ్యంపై వైయస్ జగన్కు నమ్మకం లేదని మండిపడ్డారు.
జగన్ ప్రజాభిప్రాయ సేకరణ అంటూ హడావుడి చేస్తున్నారని, అయితే ఆయన కేసుల అంశంపైనే ముందుగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని డిమాండ్ చేశారు. ప్రజలలోకి వెళ్లి పరిశీలిస్తే వారు జగన్ గురించి ఏమనుకుంటున్నారో, ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో ఆయనకు తెలుస్తుందన్నారు.
రాష్ట్ర విభజన జరగకముందు జగన్ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఇటువంటి చర్యలకు దిగడం జగన్కే చెల్లుతుందన్నారు. ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి, భ్రష్టు పట్టించడం ఏమాత్రం సరికాదని చెప్పారు.
పత్తిపాటికి చులకన: పత్తిపాటి
మంత్రి పత్తిపాటికి రైతులు అంటే చులకన అని వైసిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జున ఆరోపించారు. అందుకే వారి భూములను అన్యాయంగా లాక్కున్నారన్నారు. రూ.5వేల కోట్ల మైనింగ్ కోసం వందలాది దళిత కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ఆరోపించారు. కొందరు అధికారులు కూడా మంత్రికి వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు.
అమరావతిలో క్విడ్ ప్రోకో: వడ్డె
టిడిపి ప్రభుత్వం పైన మాజీ మంత్రి వడ్డె శోభానాద్రీశ్వర రావు మంగళవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో క్విడ్ ప్రోకో జరుగుతోందన్నారు. విక్రమ్ సోని రాసిన 'అమరావతి సహజ నగరం' పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విదేశీ కంపెనీలకు మేలు చేసేందుకు అభివృద్ధి పేరుతో స్కాం జరిగే అవకాశముందన్నారు. రైతులు చేసే త్యాగాలు వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు. రాజధానిలో జరుగుతున్న అవినీతి పైన రైతులు పోరాటం చేయాలన్నారు.