'అవినీతి' ఆస్తుల స్వాధీనానికి చట్టం తెచ్చాం: జగన్కు పత్తిపాటి షాక్
విజయవాడ: ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసుల్లో ఉన్న వారి ఆస్తుల స్వాధీనానికి చట్టాన్ని తీసుకు వచ్చామని ఆయన అన్నారు. వైసిపి అధినేత జగన్ ఆస్తుల కేసును ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు.
కేంద్ర దర్యాఫ్తు సంస్థలు అటాచ్ చేసిన ఆస్తుల స్వాధీనానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని చెప్పారు. ఈ నెల 22వ తేదీన రెండో విడత రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. ఒంగోలులో రెండో విడత రుణ మాఫీ నిధులు, రుణమాఫీ బాండ్లను రైతులకు సీఎం అందచేస్తారని చెప్పారు.
కాగా, ఏపీ ప్రత్యేక కోర్టు చట్టం కింద కేంద్ర దర్యాఫ్తు సంస్థలు అటాచ్ చేసిన ఆస్తుల స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ప్రక్రియను ప్రారంభించింది. అయితే, ఇందుకోసం ప్రత్యేక కోర్టు కాకుండా కమిషన్ను నియమించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అనంతరం చీఫ్ సెక్రటరీ ఇదే అంశంపై చర్చించారు. ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన ఫైలు వెంటనే పంపాలని సీఎం కార్యాలయం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది.
ముద్రగడపై చినరాజప్ప ఆగ్రహం
ముద్రగడ పద్మాభం చిన్న పిల్లాడిలా వ్యవహరిస్తున్నారని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ముద్రగడకు దీక్ష కొత్త కాదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఆయన దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.