చంద్రబాబు కుప్పం వదులుతున్నారు: అక్కడ పోటీ చేసినా ఓడిస్తాం - మంత్రి పెద్దిరెడ్డి..!!
టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు కుప్పంలో భయపడి మరో నియోజకవర్గానికి వస్తారనే ప్రచారం సాగుతోందన్నారు. అనంతపురం జిల్లా పార్టీ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి తాజాగా సీఎం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ప్రతీ గ్రామ సచివాయలానికి ముగ్గురు కన్వీనర్లను నియమిస్తున్నట్లు చెప్పారు. అందులో ఒక మహిళ ఖచ్చితంగా ఉంటారని వెల్లడించారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. చంద్రబాబు నియోజకవర్గం మారిన ఓడిస్తామని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.
వైసీపీ సీనియర్ మంత్రి పెదిరెడ్డి రామచంద్రా రెడ్డి పార్టీ వచ్చే ఎన్నికల పైన ఫోకస్ పెట్టారు. చిత్తూరు - అనంతపురం జిల్లాలో పార్టీ గెలుపు దిశగా కసరత్తు ప్రారంభించారు. అందు కోసం తాజాగా సీఎం జగన్ పార్టీ నేతల సమావేశంలో ప్రతీ సచివాలయం పరిధిలో పార్టీ వాలంటీర్లను నియమించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.20 లక్షల మందిని నియమాకం దిశగా డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. అధికారం లో ఉన్న పార్టీలో సాధారణంగా అసంతృప్తి అనేది ఉంటుంది... అలాంటివి ఏమైనా ఉన్నా అధిగమించి పార్టీనీ బలోపేతం చేస్తామని మంత్రి చెప్పారు. అసమ్మతి ఉంటే వారిని గుర్తించి వారితో సమన్వయం చేసుకుంటామని వెల్లడించారు. ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేసారు. సీఎం జగన్ ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పార్టీ నేతలకు నిర్దేశించారు.
గ్రామ స్థాయిలో పార్టీలో ఏమన్నా విభేదాలు ఉంటే, అవి పరిష్కరించి పార్టీని మరింత బలోపేతం చేయాలని పెద్దిరెడ్డి సూచించారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సారి కుప్పంలో పోటీ చేస్తే ఓడిపోతాననే భయం చంద్రబాబును వెంటాడుతోందన్నార. దీంతో, ఆయన కుప్పం వదలి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వస్తారనే ప్రచారం సాగుతోందన్నారు. అక్కడ పోటీ చేసినా చంద్రబాబు ఓడిపోవటం ఖాయమన్నారు. దీంతో, మరో నియోజకవర్గం వెతుక్కోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. కుప్పంలో ఈ సారి చంద్రబాబును ఓడిస్తామంటూ సీఎం జగన్ - మంత్రి పెద్దిరెడ్డి కొంత కాలంగా చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానని హెచ్చరించారు. దీంతో, ఇప్పుడు చిత్తూరు - అనంత జిల్లా రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి.