ఆర్టీసీలో ఆ పోస్టులు భర్తీ: మంత్రి పేర్ని నాని: త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు కూడా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. మొత్తం 1,800లకు పైగా కారుణ్య నియామకాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 1,800 ఉద్యోగుల కుటుంబాల వారికి కారుణ్య నియామకాల ద్వారా లబ్ది కలుగుతుందని అన్నారు. ఈ మధ్యహ్నం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు.
కారుణ్య నియామకాలకు సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని, వాటిని త్వరలోనే ఆమోదిస్తామని చెప్పారు. కారుణ్య నియామకాలను సంబంధిత జిల్లాలోనే ఉద్యోగం ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లాలవారీగా ఖాళీల జాబితాలను తెప్పించుకుంటున్నామని అన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని పేర్ని నాని చెప్పారు.
ఆర్టీసీకి నష్టాలు రావడానికి కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని పేర్నినాని అన్నారు. డీజిల్ ధరలను విపరీతంగా పెంచేయడం వల్ల.. దాని మీద ఆధారపడిన ప్రజా రవాణా కుప్పకూలి పోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆర్టీసీ డిపోలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డీజిల్ కంటే ప్రైవేటు బంకుల్లో ధర తక్కువగా ఉంటోందని అన్నారు. బయటి బంకుల్లో డీజిల్ను కొనుగోలు చేస్తే రోజూ కోటిన్నర రూపాయల భారం తగ్గుతుందని అన్నారు.
ఆర్టీసీకి వస్తోన్న నష్టాలను కొంతమేరకైనా తగ్గించాలనే ఉద్దేశంతో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటున్నామని చెప్పారు. బయటి బంకుల్లో డీజిల్ను కొనుగోలు చేయడం వల్ల ఇప్పటి దాకా 33.83 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగామని పేర్ని నాని అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే 40 బస్సులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. మిగిలిన బస్సులు ఇంకొద్ది రోజుల్లో అందుతాయని చెప్పారు.
తిరుపతి-తిరుమల మధ్య 50 బస్సులు నడుపాలని ప్రతిపాదించామని పేర్నినాని అన్నారు. 60 సంవత్సరాల పైనున్న వయస్సున్న ప్రయాణికులకు టికెట్ ఛార్జీలో రాయితీలను ఏప్రిల్ 4వ తేదీ నుంచి అమలు చేస్తామని చెప్పారు. గతంలో కరోనా వలన వాటిని నిలిపేశామని గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకోవటం వల్ల 3,000 కోట్ల రూపాయలకు పైగా అదనపు భారం ఖజానాపై పడుతోందని అన్నారు.