చింతమనేనికి పితాని స్నేహాహస్తం, ఫలించని బుజ్జి రాయబారం, కారణమిదే!
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో మంత్రి పితాని సత్యనారాయణ స్నేహహస్తాన్ని అందిస్తున్నారు.అయితే చింతమనేని మాత్రం ససేమిరా అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో తనను రాజకీయంగా ఇబ్బందిపెట్టిన పితానికి మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆయన ఆగ్రహంగా ఉన్నారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ, శాశ్వత మిత్రులు కానీ ఉండరని చెబుతుంటారు.అయితే పశ్చిమగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హయంలో మంత్రిగా ఉన్న పితాని సత్యనారాయణ టిడిపిలో చేరి మంత్రిపదవిని దక్కించుకొన్నారు.
ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన చింతమనేని ప్రభాకర్ లాంటి నాయకులకు మంత్రిపదవి దక్కలేదు.దీంతో చింతమనేని మంత్రి పదవి కోసం పార్టీ నాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.మరో వైపు తనను ఇబ్బందిపెట్టిన పితానికే మంత్రిపదవి దక్కడం పట్ల చింతమనేని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో పితానికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నాయకులకు వివరించారు. మరో వైపు మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణకు ముందే చింతమనేనికి మంత్రి పదవిని సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇవ్వడం సాధ్యం కాదనే సంకేతాలను బాబు ఇచ్చారు.
చింతమనేనికి పితాని స్నేహాహస్తం ఫలించని బుజ్జగింపులు
మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు మంత్రివర్గంలో చోటు దక్కలేదు.కానీ, ఆయన ప్రత్యర్థి పితాని సత్యనారాయణకు మంత్రిపదవి దక్కింది. అయితే పితానికి మంత్రి పదవిని ఇవ్వడాన్ని చింతమనేని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా చింతమనేని ప్రభాకర్ తో సయోధ్య కోసం మంత్రి పితాని సత్యనారాయణ ప్రయత్నాలను ప్రారంభించారు.ఈ మేరకు ఏలూరు ఎంపీ బడేటి బుజ్జితో చింతమనేని ప్రభాకర్ తో రాయబారం నడిపారు.అయితే చింతమనేని మాత్రం మెత్తబడలేదని సమాచారం. అంత ఈజీగా చింతమనేని మెత్తబడే వ్యక్తి కాదని చింతమనేని సన్నిహితులు చెబుతున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో తనను రాజకీయంగా ఇబ్బందిపెట్టేందుకుగాను పితాని అనేక ప్రయత్నాలు చేశాడని చింతమనేని చెబుతున్నారు. తనను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తికే మంత్రిపదవి రావడంతో చింతమనేని రగిలిపోతున్నారు.
పార్టీ మారినా మంత్రి పదవిని దక్కించుకొన్నాడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పితాని సత్యనారాయణ మంత్రిగా కొనసాగారు. కిరణ్ క్యాబినెట్ లో ఆయన కీలక మంత్రిత్వశాఖలను నిర్వహించారు.అయితే 2014 ఎన్నికలకు ముందే కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైఖ్యాంద్ర పార్టీలో చేరారు. ఆ పార్టీకి కూడ పితాని గుడ్ బై చెప్పారు. అసెంబ్లీ షెడ్యూల్ ప్రకటనకు ముందే ఆయన టిడిపి తీర్థం పుచ్చుకొన్నారు.పార్టీ టిక్కెట్టు కేటాయించింది ఆయన విజయం సాధించారు. మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో బాబు మంత్రివర్గంలో ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కింది. పార్టీ మారినా ఆయన వైపే అదృష్టం నిలిచింది.మరోసారి ఆయనకు మంత్రి పదవి దక్కింది.
పితానికి అన్నీ సమస్యలే
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట అసెంబ్లీ నియోజకవర్గంలో స్వంతపార్టీలోనే గట్టి ప్రత్యర్థులున్నారు. టీడిపి టిక్కెట్టు ఆశించి భంగపడిన సీనియర్ నాయకుడు గొడపర్తి శ్రీరాములు మంత్రి పితానిని అన్నీ అంశాల్లో వ్యతిరేకించడం మొదలుపెట్టింది.నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజుతో పితానికి సయోధ్య లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు వైసీపితో గంగరాజు చేతులు కలిపారని పితానీ గంగరాజుపై కోపంతో ఉన్నారు.పశ్చిమగోదావరి జిల్లాలోనే డెల్టా ప్రాంతానికి చెందిన మరో టిడిపి ఎంఎల్ ఏ తో మంత్రి పితానికి సయోధ్య లేదు.
చిటికెలో పరిష్కరించగల నేర్పరి పితాని
పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో తనకున్న సమస్యలను చిటికెలో పరిష్కరించగల నేర్పరితనం మంత్రి పితానికి ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.కలుపుగోలుతనం, నాయకత్వ లక్షణాలు, పార్టీని ముందుండి నడిపించేతత్వం ఉన్నవారికే మంత్రిపదవులు కట్టబెడుతారు.ఈ లక్షణాలున్న పితాని తన ముందున్న సవాళ్ళను సులభంగా పరిష్కరిస్తారని ఆయన చెప్పారు.రాజకీయమేధావిగా పేరున్న పితాని ఈ సమస్యలను ఇట్టే పరిష్కించుకొంటారని చెబుతున్నారు ఆయన సన్నిహితులు.