మహానాడు పెట్టింది అందుకేనా? చంద్రబాబు టీడీపీకి పట్టిన శని: మంత్రి రోజా హాట్ కామెంట్స్
ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. టీడీపీ మహానాడు రెండు రోజుల కార్యక్రమాలలో భాగంగా తొలిరోజు తెలుగుదేశం పార్టీ పలు తీర్మానాలను మహానాడు వేదికగా చేసింది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ఏపీలో ఉన్మాది పాలన సాగుతోందని, క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో వచ్చే ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అంతేకాదు వైసీపీ మూడేళ్ల పాలన పై చంద్రబాబు చండ్ర నిప్పులు చెరిగారు.
రాష్ట్రానికి, టీడీపీకి పట్టిన శని చంద్రబాబే : రోజా
ఇక ఈ క్రమంలో మహానాడులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ మంత్రులు. తాజాగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా శనివారం ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టిడిపి మహానాడు పై వ్యాఖ్యలు చేసిన రోజా రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ పట్టిన శని చంద్రబాబు నాయుడేనని వ్యాఖ్యానించారు. ఇక ఈ విషయం గతంలోనే ఎన్టీఆర్ చెప్పారంటూ, ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు రోజా.
ఎన్టీఆర్ ప్రాణాలు తీసి దండలేసి దండాలు పెడుతున్నారు
ఎన్టీఆర్ ప్రాణాలు తీసి, ఆయన ఫోటో కి నేడు వారి దండాలు పెడుతున్నారని, దండలు వేస్తున్నారని రోజా మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకి పెడితే కనీసం చంద్రబాబు కృతజ్ఞత కూడా ప్రదర్శించ లేదని మంత్రి రోజా మండిపడ్డారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని జగన్ లాంటి మంచి సీఎంను ఎన్నడూ చూడలేదని ప్రజలు చెబుతున్నారని రోజా పేర్కొన్నారు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి టిడిపి నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారు అని మంత్రి రోజా విమర్శలు గుప్పించారు.
టీడీపీ మహానాడుతో నీచాతి నీచంగా తిట్టిస్తున్నారా?
మహానాడు అని పెట్టి మహిళలతో నీచాతి నీచంగా మమ్మల్ని తిట్టిస్తున్న ఘటనలు చూస్తున్నామని పేర్కొన్న రోజా చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. మామను చంపిన ఆ చేతులతోనే దండం పెడుతున్న చంద్రబాబు ఎంతటి ఘనుడో ప్రజలకు తెలుసని రోజా విమర్శించారు.
చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా మహానాడులో సీఎం జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని చంద్రబాబు పై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రజల కోసం ఏమీ చేయలేదని రోజా విమర్శించారు.
జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ నుండి బయటకు పంపింది అందుకే
టిడిపి మహానాడు వైసీపీ మంత్రులను, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కోసమే పెట్టుకున్నారని రోజా ఎద్దేవా చేశారు. టిడిపి మహానాడు ద్వారా ప్రజలకు మంచి పనులు చేస్తామని హామీ ఇవ్వలేకపోయారు అంటూ రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ అంటే నచ్చదని, ఎన్టీఆర్ అన్న పేరు అంటే చంద్రబాబుకు భయమని రోజా వెల్లడించారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ని చూసి భయపడి పార్టీ నుంచి బయటకు పంపేశారని రోజా విమర్శలు గుప్పించారు.
పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టుకుంది అందుకే
చంద్రబాబు తనయుడు ముద్దపప్పు ఎందుకు పనికి రాడని, అందుకే దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టుకున్నాడని రోజా విమర్శించారు. కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలని అడిగిన టిడిపి, జనసేన నాయకులు ఇప్పుడు యూటర్న్ తీసుకుని విధ్వంసాలకు పాల్పడ్డారని, చంద్రబాబు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చే ప్రయత్నంచేస్తున్నాడు అంటూ రోజా తిట్టిపోశారు.
దళిత మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను తగలబెట్టి కుట్రలు చేశారని, ఈ కుట్ర వెనక ఉన్నది ఎవరో రాష్ట్రంలో అందరికీ తెలుసు అంటూ రోజా టిడిపి, జనసేన ను టార్గెట్ చేశారు.చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు అంటూ పేర్కొన్న రోజా, చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు 14 ఏళ్లలో చేయలేనిది జగన్ మూడు సంవత్సరాలలో చేసి చూపించాడని రోజా పేర్కొన్నారు. జగన్ ను ఎదుర్కోవటం చంద్రబాబు వల్ల కాదని రోజా తేల్చి చెప్పారు.