మంత్రి రోజా సంచలనం: క్విట్ చంద్రబాబు.. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 2024ఎన్నికలు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పడే ఎన్నికల వేడి కనిపిస్తుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు రానున్న ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఇప్పటి నుండి ముందుకు వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు టిడిపి, జనసేన పొత్తుల రాజకీయాలు అంటూ చర్చ జరుగుతూ ఉంటే, మరోపక్క వైసిపి గడపగడపకు మన ప్రభుత్వం, మంత్రుల బస్సుయాత్ర కార్యక్రమాలతో ఇప్పటి నుంచే ఎన్నికల రాజకీయాలకు తెర తీసింది. ఇక తాజాగా ముఖ్య నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచుతున్నాయి.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా.. ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజా దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ప్రతిపక్ష పార్టీలపై అంతే దూకుడుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు . తిరుమలలో ఈరోజు శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును టార్గెట్ చేశారు. క్విట్ చంద్రబాబు.. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 2024 ఎన్నికలకు వెళతామని మంత్రి రోజా ప్రకటించారు.
చంద్రబాబు కడప టూర్ ను టార్గెట్ చేసిన మంత్రి రోజా
ఈరోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రులు అంబటి రాంబాబు, రోజా, ఉషశ్రీ, ఎంపీలు గురుమూర్తి, కృష్ణదేవరాయలు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా రానున్న ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే అన్ని పార్టీలలో ఎన్నికల సందడి కనిపిస్తున్న నేపథ్యంలో తాజాగా రోజా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కడప వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సీఎం వైఎస్ జగన్ పై చంద్రబాబు చేసిన విమర్శలపై విరుచుకు పడిన రోజా కడప లో చంద్రబాబు చేసిన విమర్శలు హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అసమర్థుడు .. టీడీపీ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు
కుప్పంలో జరిగిన అభివృద్ధి, పులివెందులలో జరిగిన అభివృద్ధికి మధ్య ఉన్న తేడాను గమనించాలని మంత్రి రోజా హితవు పలికారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పని చేసినప్పటికీ చంద్రబాబు కుప్పం ను కనీస రెవిన్యూ డివిజన్ గా కూడా మార్చలేదని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు అసమర్థుడు అంటూ రోజా విమర్శలు గుప్పించారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తాము ప్రజలలో ధైర్యంగా తిరుగుతున్నామని రోజా పేర్కొన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా ముందు డాన్స్ చేస్తున్నారంటూ రోజా విమర్శించారు. వచ్చేఎన్నికలలో చంద్రబాబును ఏపీ నుండి పంపించడం ఖాయమంటూ రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయడమే లక్ష్యంగా గడప గడపకు ప్రభుత్వం
ఇదిలా ఉంటే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జోరుగా పాల్గొంటున్న మంత్రి రోజా గురువారం నాడు నగరి మండలం బుగ్గ అగ్రహారం సచివాలయం పరిధిలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఆనందం మాటల్లో చెప్పలేనిదని, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని, ప్రతిపక్షాలు కావాలని అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని రోజా మండిపడ్డారు.