చంద్రబాబును అందుకే దించారు - బకాయిలు పెట్టి వెళ్లారు : రోజా ఫైర్..!!
మంత్రి రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు పైన ఫైర్ అయ్యారు. చంద్రబాబు హయాంలో చెల్లించాల్సిన రూ 1800 కోట్ల ఫీజు బకాయిలను చెల్లించకుండా బకాయి పెట్టి వెళ్లిపోయారని రోజా ఆరోపించారు. ఇప్పుడు బాదుడే - బాదుడు అంటున్న చంద్రబాబు తన హయాంలో వ్యాట్ ..విద్యుత్ ఛార్జీలు పెంచలేదా అని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రయివేటు పరం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తే..జగన్ దానిని ప్రభుత్వం లో విలీనం చేసారని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ బకాయిలను చెల్లించటమే కాకుండా.. ప్రతి మూడు నెలలకు ఒకసారి బకాయిలు చెల్లిస్తున్నామని చెప్పారు.
సీఎం జగన్ మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారన్నారు. గతంలో నారకాసుర ఆంధ్రప్రదేశ్ గా అనిపించింది కాబట్టే చంద్రబాబుని దించి జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టాంటూ రోజా ధ్వజమెత్తారు. కొంత మంది ఉన్మాదుల వల్ల జరిగే ఘటనలపైన ప్రభుత్వం సీరియస్ వ్యవహరిస్తోందని.. కఠిన శిక్ష విధిస్తోందని చెప్పుకొచ్చారు. మహిళలపై దాడులు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ లో మూడు శాతం తగ్గాయని మంత్రి రోజా వివరించారు.డిస్కంలకు చంద్రబాబు హయాంలో 28వేల కోట్లు బకాయిలు పెట్టారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచారని గుర్తు చేసారు. సీఎం జగన్ కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేసారని వివరించారు. ఇక, ఈ నెల అయిదో తేదీన ముఖ్యమంత్రి జగన్ తిరుపతి పర్యటనకు వస్తున్నారు. తాను మంత్రి అయిన తరువాత తొలిసారి సీఎం తమ జిల్లాకు రావటం పైన రోజా హర్షం వ్యక్తం చేసారు. 5వ తేదీన తిరుపతిలో సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లును మంత్రులు పెద్దిరెడ్డి..రోజా..స్థానిక ఎమ్మెల్యే భూమనతో కలిసి పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక, రోజా ఇప్పటికే మంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత పలువురు ప్రముఖులను కలిసారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ...సీఎం జగన్ తల్లి విజయమ్మ.. చిరంజీవితోనూ రోజా భేటీ అయ్యారు. వారంతా రోజా మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.