మేం పక్కా మాస్.. వైసీపీ నాయకులకు మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్!
వైసీపీ నాయకులకు మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్దిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నా వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశామని చెప్పారు. అభివృద్ధి కేరాఫ్ అడ్రాస్ కూటమి ప్రభుత్వమని స్పష్టంచేశారు. అక్టోబర్ నుంచి నూతన పెన్షన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు.
గొడ్డలి పార్టీకి గుణపాఠం చెప్పాలని మంత్రి సవిత పిలుపు
త్వరలో ఇళ్ల స్థలాలు కూడా అందజేయబోతున్నామని వెల్లడించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి కూటమి పార్టీ అభ్యర్థులను గెలిపించి, గొడ్డలి పార్టీకి గుణపాఠం చెప్పాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. 5 ఏళ్లలో జగన్ రెడ్డి ఏనాడైనా డీఎస్సీ నిర్వహించారా.. అని ప్రశ్నించారు.
ఒక్క రోడ్డయినా వేశారా..? అని నిలదీశారు.

దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రండి అంటూ మంత్రి సవాల్
మా నాయకుడు రప్పా రప్పా అని నరకమని చెప్పలేదన్నారు. కబ్జాలు, దోపీడీలు చేయమని చెప్పలేదు... మాకు సభ్యత, సంస్కారం నేర్పారన్నారు మంత్రి సవిత. ఒకర్ని ఇబ్బంది పెట్టే నైజం తమది కాదని స్పష్టం చేశారు. మీకు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రండి... పెనుకొండ అంబేద్కర్ జంక్షన్ అయినా... గోరంట్ల నిమ్మల కృష్ణప్ప థియేటర్ అయినా... తేల్చుకుందాం అన్నారు.
మేం పక్కా మాస్ అంటూ సవిత వార్నింగ్
కళ్యాణదుర్గమైనా...ధర్మవరమైనా...పులివెందులైనా... ప్లేస్, టైమ్ మీరే డిసైడ్ చేయండి...అంతేగాని నోరుంది కదా అని మాట్లాడితే ఊరుకునేది లేదు... మేం పక్కా మాస్... మా నోళ్లకు కంట్రోల్ ఉండదు.. ఖబడ్డార్' అంటూ పేర్కొన్నారు. 'నేను లోకల్... పుట్టింది ఇక్కడే ... పెరిగింది ఇక్కడే... పోయేది ఇక్కడే... నేనేంటో పెనుకొండ వాసులందరికీ తెలుసు అని చెప్పారు మంత్రి సవిత.
డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కడుపు మంట చల్లార్చుకుంటున్న జగన్
ఒక్క చిన్న మంచి పని కూడా జగన్ చేయలేదన్నారు. చివరికి పులివెందులకు సాగునీరు ఇచ్చింది చంద్రబాబే... త్వరలో తాగునీరు కూడా ఇవ్వబోతున్నదీ చంద్రబాబే...అంటూ వైసీపీ నాయకులపై మంత్రి సవిత తీవ్రంగా విరుచుపడ్డారు. ఒక డీఎస్సీని కూడా జగన్ నిర్వహించలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీ నిర్వహించిందన్నారు. ఆ డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ జగన్ కడుపు మంట తీర్చుకుంటున్నారన్నారు.
ఏటా డీఎస్సీలు నిర్వహించి, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ
ఇకపై ఏటా డీఎస్సీలు నిర్వహించి, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్లు కూడా జారీ చేసి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపడతామని తెలిపారు. వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేయటం ఆపి దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications