పడవలో వెళ్లి.. కోనసీమ ముంపు గ్రామాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రి వేణుగోపాల కృష్ణ!!
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ అనేక మారుమూల ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా కోనసీమ జిల్లాలో వరద ప్రభావం కనిపిస్తుంది. గోదావరికి, ఉప నది గౌతమికి వరద పోటెత్తిన నేపధ్యంలో వరద తీవ్రతతో అనేక లంక గ్రామాలు నీటమునిగాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
వరద బాధితులకు భరోసా ఇవ్వటానికి ముంపు గ్రామాల్లో పర్యటించిన మంత్రి
ఆరడుగుల లోతు వరద నీళ్లల్లో బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. తమకు సహాయం అందించే వారి కోసం బిక్కు బిక్కు మంటూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గోదావరి ముంపు ప్రాంతాలలో విస్తృతంగా సహాయక చర్యలను చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగి, వరద ముంపులో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, వారికి ఆహారాన్ని, మందులను అందిస్తున్నారు. ఈ క్రమంలో వరద బాధితులకు భరోసా ఇవ్వడం కోసం ముంపు గ్రామాల్లో పర్యటించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.
వరద నీటిలో మంత్రి పడవ ప్రయాణం.. బాధితులకు నిత్యావసరాలు పంపిణీ
వరద నీటిలో పడవలో ప్రయాణం చేసిన మంత్రి వేణుగోపాలకృష్ణ కోటిపల్లిలోని ముంపుకు గురైన ప్రాంతాలలో బాధితులకు బియ్యం, కందిపప్పు తదితర నిత్యావసరాలను అందించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులతో పాటు మంత్రి కూడా స్వయంగా పర్యటిస్తూ సహాయక చర్యలు అందిస్తున్నారు. వరద బాధిత కుటుంబాలకు తామున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. అత్యవసర మందులు, త్రాగునీరు వారికి అందిస్తున్నట్టు, వారికి ఆహారానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నట్టు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ పేర్కొన్నారు.
లంక గ్రామాలు జలదిగ్బంధం .. భయం గుప్పిట్లో ప్రజలు
గోదావరి, గోదావరి ఉపనది గౌతమి వరద తీవ్రతతో రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో కే గంగవరం మండలంలోని పలు లంకలు, కోటిపల్లి ప్రాంతాలు వరద దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. లంక గ్రామాలతోపాటు లోతట్టు ప్రాంతాల లోనూ వరద నీరు వచ్చి చేరింది. ఇళ్ల మధ్య కు వరద నీరు చేరుకోవడంతో పడవల పైన రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.
మంత్రి వరద ముంపు ప్రాంతాల్లో సహాయం అందించటం కాస్త ఊరట
ఇక వారికి సహాయ చర్యలను అందించిన మంత్రి పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆరు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయిందని, ఈ ప్రాంతానికి సమీపంలోనే అఖండ గోదావరి, ఉపనది గౌతమి ఉండటంతో మరో రెండు రోజుల పాటు ఇబ్బందులు తప్పేలా లేదని అధికారులు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణకు చెప్పారు. ఏదేమైనా మంత్రి స్వయంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వడం వరద ముంపులో చిక్కుకున్న వారికి కాస్త మనోధైర్యాన్ని ఇచ్చిందని చెప్తున్నారు.