రాబోయే పదేళ్ళలో క్యాన్సర్ నివారణలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ: మంత్రి విడదల రజిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య రంగంలో అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయని, రాబోయే 10 ఏళ్లలో క్యాన్సర్ నివారణలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య రంగంలో అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయని, రాబోయే 10 ఏళ్లలో క్యాన్సర్ నివారణలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. క్యాన్సర్ నివారణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని పేర్కొన్న విడదల రజని ఈరోజు విశాఖ ఆర్కే బీచ్ లో క్యాన్సర్ అవగాహన వాకథాన్ లో పాల్గొన్నారు.
విశాఖ వాసులతో కలిసి వాకథాన్ లో పాల్గొన్న మంత్రి విడదల రజిని ఏపీ ప్రభుత్వం క్యాన్సర్ నివారణకు ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి విడదల రజిని ఏపీ బడ్జెట్లో 400 కోట్ల రూపాయలను క్యాన్సర్ నివారణకు కేటాయించారని గుర్తు చేశారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కి హోమి బాబా క్యాన్సర్ కేర్ సెంటర్ తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. విశాఖ కేజీహెచ్ లో 60 కోట్ల రూపాయలతో క్యాన్సర్ క్రిటికల్ కేర్ యూనిట్ ని ఏర్పాటు చేస్తున్నామని ఆమె వెల్లడించారు.

120 కోట్ల రూపాయలతో క్యాన్సర్ యూనిట్ ఏర్పాటు జరుగుతుందని విడదల రజిని స్పష్టం చేశారు.క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన విడదల రజని, క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే దాని నివారణ సులభం అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల బట్టి కోటి 60 లక్షల మంది ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన పడుతున్నారని మంత్రి విడదల రజని తెలిపారు. 2030 నాటికి 30 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోందని, అందుకే ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ముఖ్యంగా మహిళలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలకు వైద్య సేవలను అందించడంలో ఏపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి జగన్ సర్కార్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి విడదల రజని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications