'మోడీని చూసి మినిస్టర్స్ బిజెపిలో చేరతామంటున్నారు'
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పెరుగుతున్న ఆదరణను చూసి రాష్ట్రానికి చెందిన పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. విభజన నిర్ణయం నేపథ్యంలో కొంతకాలం క్రితం పలువురు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు పెద్దగా కాకపోయినా బిజెపి రాగం ఆలపించారు. ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అదే చెబుతున్నారు. తమ పార్టీలో చేరేందుకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారని, వారంతా క్యూ కడుతున్నారని అన్నారు.
అటల్ బిహారి వాజపేయి 89వ జన్మదిన సందర్భంగా రాష్ట్ర బిజెపి రాష్టక్రార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు చేతులు మీదుగా పేద మహిళలకు కుట్టుమిషన్లను పంచి పెట్టారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో కలిసే పార్టీల నాయకులు పొత్తుల విషయంలో తమకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. మిగతా పార్టీల ఎంపిలు కూడా తమ పార్టీ నుండి పోటీ చేయడానికి క్యూ కట్టారని చెప్పారు.
ప్రస్తుత రాజకీయ నేతలకు వాజపేయ ఆదర్శం కావాలని అన్నారు. పొరుగు దేశాలతో సంబంధాలను ఏర్పరిచారని, దేశంలో ధరలను, ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టారని వెంకయ్యనాయుడు చెప్పారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూర్చేలా అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వాజపేయిదేనని అన్నారు. అణుసామర్ధ్యాన్ని ప్రదర్శించి అమెరికాకు తలతిరిగేలా జవాబు చెప్పారని అన్నారు.
13 ఏళ్ల క్రితం శాంతియుతంగా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన ఘనత కూడా తమదేనని అన్నారు. దేశంలో ప్రస్తుతం అంతరాలు తగ్గించే పాలన కావాలని ఆకాంక్షించారు. బిజెపి ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది టిఆర్ఎస్ వంటి పార్టీలు చెప్పనక్కర్లేదని, తమకు తెలుసని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. బిజెపి, మోడికి ఉన్న ఆదరణ చూసి కొందరు తమ పార్టీలోకి వచ్చేందుకు సై అంటున్నారన్నారు.
అంతకు ముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ తాము ఈసారి అన్ని నియోజకవర్గాల నుండి ఒంటరిగానే పోటీ చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్ని రంగాల్లో సంక్షోభాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు. పేదల ప్రభుత్వంగా గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చాక పేదలకే శాపంగా మారిందని అన్నారు. దేశవ్యాప్తంగా బిజెపి పట్ల ప్రజలు ఆదరణ చూపుతున్నారని, కాంగ్రెస్ను గద్దెదించే తరుణం ఆసన్నమైందని పేర్కొన్నారు.