మేమే గనుక తిరగబడితే... లోకేష్ తిరిగి బయటకొచ్చేవాడు కాదు... మంత్రి ఘాటు వ్యాఖ్యలు..
ఏపీ శాసనమండలిలో అధికార,ప్రతిపక్ష నేతల మధ్య ఘర్షణపూరిత వాతావరణంపై పరస్పర ఆరోపణలు,విమర్శలు కొనసాగుతున్నాయి. మంత్రులే తమవాళ్లపై దాడికి పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తుంటే.. టీడీపీ నేతలే తమపైకి దూసుకొచ్చారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై తాజాగా మంత్రులు బొత్స సత్యనారాయణ,వెల్లంపల్లి శ్రీనివాస్లు మాట్లాడుతూ మరోసారి టీడీపీపై పలు ఆరోపణలు చేశారు. సభలో టీడీపీ నేతలు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడమే కాకుండా వైసీపీ నేతలపై దౌర్జన్యానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు.

ఇదేంటని నిలదీస్తే మాపై కలబడ్డారు...
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజా మద్దతు లేకపోయినా,మండలిలో మెజారిటీ ఉంది కాబట్టి దౌర్జన్యం చేస్తామంటే కుదరదన్నారు. మెజారిటీ ఉంటే బిల్లు వీగిపోయేలా చేసుకోండి తప్పితే.. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడమేంటని ప్రశ్నించారు. లోకేష్పై తాము దాడి చేశామని చెప్పడం అవాస్తవమన్నారు. లోకేష్ సెల్ఫోన్ పట్టుకుని సభలో ఫోటోలు,వీడియోలు తీస్తుంటే అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు. ఇదే విషయంపై నిలదీస్తే తమ పైకి వచ్చి కలబడ్డారని ఆరోపించారు. పిల్ల చేష్టలు,దాదాగిరి సభలో కుదరవన్నారు.

టీడీపీ నేతల ఉద్దేశాలు వేరు..
40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు తనయుడికి సభలో ఎలా ఉండాలో తెలియదన్నారు. తెలియకపోతే తెలుసుకోవడంలో తప్పు లేదని.. కానీ దాడులకు పాల్పడుతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రూల్.90ని మండలి ఛైర్మన్ అడ్మిట్ చేశారని యనమల చెబుతున్నారని.. మరి ప్రభుత్వం ఇచ్చిన సీఆర్డీయే రద్దు,పాలనా వికేంద్రీకరణ బిల్లులను కూడా ఛైర్మన్ చర్చకు అడ్మిట్ చేశారన్న విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ బిజినెస్ ముందు కానిచ్చి.. అభ్యంతరం ఉన్న బిల్లులపై ఆఖరున చర్చ జరుపుదామని చెప్పామన్నారు. కానీ టీడీపీ నేతల ఉద్దేశాలు వేరు అని,అందుకే సభలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు.
Recommended Video

మంత్రి వెల్లంపల్లి ఘాటు వ్యాఖ్యలు
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సభలో సంఖ్యా బలం ఉంది కదా అని దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దౌర్జన్యానికి పాల్పడితే తగిన ఫలితం అనుభవిస్తారన్నారు. లోకేష్ అనే వ్యక్తి మండలిలో ఎమ్మెల్సీగా ఉండటం దురదృష్టకరం అన్నారు. దీపక్ రెడ్డి లాంటి రౌడీలు,లోకేష్ గూండాలు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ తామే గనుక తిరగబడితే.. లోకేష్ కౌన్సిల్ నుంచి బయటకు తిరిగొచ్చేవాడు కాదన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఇది దురదృష్టకర సంఘటన అని అభిప్రాయపడ్డారు. టీడీపీ ఎన్ని కుట్రలు,కుతంత్రాలు పన్నినా.. ప్రజలు తమవైపే ఉన్నారని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications