ఫ్రీజోన్.. అమరావతిలో ఇక ఉద్యోగాలు: బాబు సభలో మిస్ ఫైర్, కానిస్టేబుల్ మృతి
తడకనపల్లెలో నిర్వహించిన సీఎం సభ దగ్గర స్పెషల్ పార్టీ పోలీసు చేతిలోని గన్ ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఎవరికీ హానీ జరగలేదు.
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఫ్రీ జోన్గా చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ప్రకటించారు. అమరావతిని ఫ్రీజోన్గా ప్రకటించాలని బైరెడ్డి రాజశేఖర రెడ్డి, టీజీ వెంకటేష్ సహా పలువురు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఫ్రీజోన్గా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అమరావతిలో అందరికీ ఉద్యోగాలు వస్తాయన్నారు. రాయలసీమ నుంచి కరవును తరిమికొట్టేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
చంద్రబాబు సభలో మిస్ ఫైర్
చంద్రబాబు సభలో మిస్ ఫైర్ జరిగింది. ఈ ఘటనలో సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన ఓ కానిస్టేబుల్ మృతిచెందాడు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామం వద్ద ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు విధుల నిమిత్తం అనంతపురం జిల్లా స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ అంపయ్య (24) పీసీ నంబర్ 136 తుపాకీ మిస్ ఫైర్ అయి గాయపడ్డాడు.
బుల్లెట్ గుండె భాగంలోకి వెళ్లింది.అతనిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్లూరు మండలం తడకనపల్లెలో సీఎం సభ కోసం బందోబస్తుకు వచ్చాడు. సభకు అర కిలోమీటరు దూరంలో బందోబస్తు నిర్వహిస్తుండగా మధ్యాహ్నం మిస్ ఫైర్ అయింది.