లాక్ డౌన్ ఎత్తివేత ఊహాగానాలపై ప్రజల్లో మిశ్రమ స్పందన- ప్రభుత్వాలు సిద్ధమేనా ?
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో ఏప్రిల్ 14 వరకూ కేంద్రం విధించిన లాక్ డౌన్ ఎత్తేస్తారా లేక కొనసాగిస్తారా అన్న చర్చ సాగుతోంది. అయితే లాక్ డౌన్ ఎత్తేస్తారన్న ఊహాగానాలపై ప్రజల్లో మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది
లాక్ డౌన్ కొనసాగింపుకు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వాదనలన్నింటికీ ప్రధాన కారణం మాత్రం నిన్న ప్రధాని మోడీ సీఎంలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో లాక్ డౌన్ తర్వాత పరిస్ధితులు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరడమే.

లాక్ డౌన్ ఎత్తివేతకు అనుకూలంగా..
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ఎత్తివేతపై కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు అందుతున్న నేపథ్యంలో అదే సరైన నిర్ణయమని కొందరు అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా అన్నిరంగాలు కుదేలవుతుండటం, వలస కూలీలకు రోజు గడవని పరిస్ధితులు రావడం, లక్షల సంఖ్యలో ఉద్యోగాల్లో, జీతాల్లో కోతలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ ఎత్తేస్తేనే మేలనే అభిప్రాయం వీరి నుంచి వినిపిస్తోంది. అన్నింటికీ మించి ప్రజల రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితం కావడంపై ఆందోళన వ్యక్తమవుతున్నట్లు వీరి మాటలను బట్టి అర్ధమవుతోంది.

లాక్ డౌన్ కొనసాగించాలని...
ప్రస్తుతం లాక్ డౌన్ విధించడం వల్ల దేశంలో కరోనా వైరస్ కేసులు కాస్తైనా అదుపులో ఉన్నాయని భావిస్తున్న మరికొందరు .. కనీసం మరో నెలరోజుల పాటైనా దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో పరిస్ధితులు అదుపులోకి వస్తున్నాయని, మరో పది రోజుల్లో లాక్ డౌన్ ఎత్తేస్తే ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తారని అప్పుడు కరోనా వైరస్ ప్రభావం మరింత పెరిగిపోతుందని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లాక్ డౌన్ ఎత్తివేతకు ప్రభుత్వాలు సిద్ధమేనా ?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో పరిస్దితులను పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకోవడం రాష్ట్ర ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారుతోంది. నిత్యం ప్రజలను నియంత్రించలేక పోలీసులు సైతం లాఠీ చేత పట్టుకోవాల్సి వస్తోంది. లాక్ డౌన్ మినహాయింపులు ఇస్తున్న ఉదయం సమయాల్లో షాపింగ్ కోసం గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్న జనాన్ని అదుపు చేయలేక, వారికి అవగాహన కల్పించలేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ మినహాయింపు వేళలను పలుమార్లు సవరించారు. ఇప్పుడు పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేయాల్సి వస్తే ప్రభుత్వాలు అందుకు ఏ మేరకు సిద్ధంగా ఉంటాయన్న దానిపై అనుమానాలు నెలకొంటున్నాయి.
Recommended Video

ప్రధాని సూచనతో కార్యాచరణ..
ప్రధాని నరేంద్రమోడీ లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పరిస్ధితులు అదుపు తప్పకుండా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దీంతో ఇప్పుడు ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేతకు సిద్దమవుతూనే ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వాలు దృష్టిసారిస్తున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత ప్రజలు భారీగా రోడ్లపైకి రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై సూచనలు సలహాలు ఇవ్వాలని అధికారులను కోరుతున్నాయి. ఇవన్నీ కొలిక్కి వస్తేనే లాక్ డౌన్ ఎత్తివేతపై ప్రధాని మోడీ తుది నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications