మరోసారి నోరు జారిన బొండా ఉమ, తీవ్ర వ్యాఖ్యలు
విజయవాడ: మొన్నటి వరకు అసెంబ్లీ, ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు... ఆంధ్రప్రదేశ్లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులను వెదజల్లుతున్న అధికార పార్టీ, హోటళ్లలో ఉపాధ్యాయులకు విందులిచ్చిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తాడి శకుంతల ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆమె ఆదివారం ఉదయం నగరంలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలివి. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం విజయవాడలోని ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

బరి తెగించి మాట్లాడటం ఒక్క వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకే చెల్లిందన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో శూర్పణఖలు, తాటకిలు ఉన్నారని ఆయన తాడి శకుంతల, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
ఏపీ శాసనమండలికి ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరుగుతున్న విషయం తెలిసిందే. కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమ గోదావారి జిల్లాల నియోజక వర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications