ఎమ్మెల్యే జోగి రమేష్ స్ట్రాంగ్ వార్నింగ్ .. ఇది ఆరంభం మాత్రమే .. నోరు అదుపులో పెట్టుకో అయ్యన్న !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడెల వర్ధంతి నాడు టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల పై మండిపడిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు టిడిపి నేతలను రెచ్చగొట్టి తిట్టిస్తున్నారని, చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించి మరి చంద్రబాబు ఇంటిని ముట్టడించారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, చంద్రబాబు ఇంటి ముట్టడితో ఉద్రిక్తత చోటు చేసుకోగా జోగి రమేష్ తీరును టీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు.
చంద్రబాబు ఇంటిపై వైసీపీ దండయాత్ర చేసిందని టీడీపీ ఆరోపణ
ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరులతో, వైసిపి కార్యకర్తలతో చంద్రబాబు ఇంటిని ముట్టడించటం ఉద్రిక్తతలకు కారణమైంది. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య బాహాబాహీ కొనసాగింది. కర్రలు, రాళ్లతో దాడులకు పురిగొల్పింది. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిన్న ఎమ్మెల్యే జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఎమ్మెల్యే జోగి రమేష్ గుండాలా ప్రవర్తించారని, వైసిపి గుండాలతో చంద్రబాబు ఇంటిపై దాడి చేశారని, వైసిపి నేతలంతా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇంటి పై దండయాత్ర చేశారని, ఇది ప్రభుత్వ సహకారంతో జరిగిన దాడి అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
చంద్రబాబును కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వాలని వెళ్ళానన్న జోగి రమేష్
దీనికి సమాధానంగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ స్పందించారు. అయితే అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపైనే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళన చేయడానికి తాను వెళ్లానని పేర్కొన్న జోగి రమేష్, అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలపై బాధ కలిగి నిరసన తెలియజేసేందుకే తాను వెళ్లాను అన్నారు. చంద్రబాబును కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్లానని, తన వెంట వైసిపి కార్యకర్తలు మాత్రమే ఉన్నారని జోగి రమేష్ చెప్పారు.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు: జోగి రమేష్ వార్నింగ్
టిడిపి కార్యకర్తలు తన కారు అద్దాలు పగలగొట్టారు అని పేర్కొన్న జోగి రమేష్ చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. సిఎంపై అనుచిత వ్యాఖ్యల పట్ల చంద్రబాబు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతామని, అయ్యన్నపాత్రుడు మళ్లీమళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని జోగి రమేష్ ధ్వజమెత్తారు. ఇదే సమయంలో టిడిపి నేతలకు, అయ్యన్నపాత్రుడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని, ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు.
చంద్రబాబే తమపై దాడి చేయించారన్న జోగి రమేష్
అయ్యన్నపాత్రుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ చేసిన వాళ్ళు, గుండాలు, రౌడీలతో చంద్రబాబు తమపై దాడి చేయించారని జోగి రమేష్ ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ జోగి రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఆయన చేసిన పనికి ఆయనను సస్పెండ్ చేస్తారో లేక జాతీయ అధ్యక్షుడిగా చేస్తారో మీ ఇష్టం అని పేర్కొన్న జోగి రమేష్ అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోవాలని హితవుపలికారు.
గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్న జోగి రమేష్
వైయస్ జగన్మోహన్ రెడ్డిని, మంత్రులను అసభ్యంగా తిట్టడం వెనుక చంద్రబాబు స్క్రిప్టు ఉందని జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలియజేయడానికి వెళితే తన పైనే దాడి చేశారంటూ ఆరోపించారు. నిన్న చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనను తాము గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే జోగి రమేష్ స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే టీడీపీ నేతలు చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడిని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తాం అని చెప్పారు.