సింగిల్ కటౌట్...సింపుల్ స్మైల్ తో జగన్ : కుప్పంలో బాబులిద్దరినీ కసి దీరా కుమ్మేసారు : అసెంబ్లీలో రోజా పంచ్ లు.
ఏపీ శాసనసభలో నగరి ఎమ్మెల్యే రోజా పంచ్ లతో చెలరేగారు. చంద్రబాబు..లోకేశ్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. కుప్పం ఫలితాల పైన చంద్రబాబు..లోకేశ్ ను కార్నర్ చేసారు. మహిళా సాధికారత పైన జరిగిన స్వల్ప కాలిక చర్చలో రోజా ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. తనకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారని..జగన్ మూడో అన్నయ్య గా చెప్పుకొచ్చారు. తాను అన్నా అంటూ చంద్రబాబు వద్దకు వెళ్తే పదేళ్ల పాటు రూపాయి తీసుకోకుండా పని చేస్తే..నమ్మించి గొంతు కోసారని ఫైర్ అయ్యారు.

అన్నా అనగానే ఆదరించారు
తాను జగన్ ను కలిసి ఎమ్మెల్యే కావాలని ఉందని చెప్పానని..తనను రెండు సార్లు ఎమ్మెల్యేను చేసారంటూ.. తనకు కీలకమైన ఏపీఐఐసీ పదవి కేటాయించారంటూ చెప్పారు. గర్భంలో ఉన్న ఆడపిల్ల నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వవరకు.. ప్రతి దశలో మహిళలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. అమ్మ జన్మనిస్తే.. జగనన్న జీవితాన్నిచ్చాడని ఎమ్మెల్యే రోజా అన్నారు. మహిళల తలరాతను మార్చే పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వమని ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఏపీలో అమలు చేస్తున్న మహిళా సంక్షేమం గురించి వివరించారు.

ఆ నిర్ణయాలు చూస్తే మైండ్ బ్లాక్
పాదయాత్ర సమయంలో కాలికి ముల్లు గుచ్చుకున్నా..కత్తి దిగినా మహిళా సంక్షేమంలో మాత్రం వెనక్కు తగ్గలేదన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మహిళలకు ప్రాధాన్యత జగన్ ఇచ్చారన్నారు. జగన్ అన్న బంగారం అంటూ ఉద్వేగానికి గురయ్యారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు పింఛన్లు..పదవుల్లో మహిళలకు 50 శాతం పదవులు కేటాయించారని గుర్తు చేసారు. మహిళలకు జగన్ ఇంత చేస్తున్నారు... మరి, మహిళలు జగన్ గురించి ఏమనుకుంటున్నారనేది తమకు తెలుసుకోవాలని ఉండేదన్నారు.

సింగిల్ కటౌట్..సింపుల్ స్మైల్ తో జగన్ ఇక్కడే కూర్చొని
అయితే, 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతీ ఎన్నికలోనూ గెలిపించి మహిళలు జగన్ కే పట్టం కట్టారన్నారు. తాజాగా కుప్పంలో వచ్చిన ఫలితాల గురించి రోజా సెటైర్లు వేసారు. తనను అసెంబ్లీ నుంచి బయటకు నెడితే అన్నగా జగన్ తోడు నిలిచారని గుర్తు చేసుకున్నారు. సింగిల్ కటౌట్..సింపుల్ స్మైల్ తో జగన్ ఇక్కడే కూర్చొని ఎన్నికల్లో గెలిచారని రోజా చెప్పారు. ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకొనే చంద్రబాబు..గల్లీ గల్లీ తిరిగినా కుప్పం ప్రజలు ఛీ కొట్టారని వ్యాఖ్యానించారు. కుప్పంలో లోకేశ్ మాట్లాడుతూ కుప్పం గడ్డ..చంద్రబాబు అడ్డా అని అన్నారని...చంద్రబాబు ఏం చేసారో..జగన్ ఏం చేస్తున్నారో బాగా ఆలోచించుకోమని చెప్పారని..అలా జనం ఆలోచించే ఈ ఫలితం ఇచ్చారని రోజా చెప్పారు.

చంద్రబాబు కుప్పం వదిలిపోవాల్సిందే
తన జన్మదినం గిఫ్ట్ గా కుప్పంలో చంద్రబాబు ఓడిపోవటాన్ని అభివర్ణించారు. ఇక, కుప్పంకు చంద్రబాబు బాధ లేదని..బాబులిద్దరూ కుప్పం వదలి తట్టా బుట్టా సద్దుకొని పోవాలని రోజా పేర్కొన్నారు. కుప్పంలో వారిద్దరినీ కసి దీరా కుమ్మేసారని వ్యాఖ్యానించారు. అదే టీడీపీ నేతలకు దమ్ముంటే పులి వెందుల వెళ్లాలని సవాల్ చేసారు. అక్కడ జనమే ముందు టీడీపీ నేతలను తన్ని పంపిస్తారంటూ చెప్పుకొచ్చారు. ఇక, అచ్చెన్నాయుడు అడ్డదిడ్డంగా పెరిగి.. సవాళ్లు చేస్తున్నారని...ఆయన కాదు..తానే మూడు ఆప్షన్లు ఇస్తున్నానని చెప్పారు.

2019 నుంచి ఒకటే జెండా - అజెండా
అచ్చెన్నాయుడు తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని..లేదా కుప్పంలో లోకేశ్ ను బరిలోకి దింపి పోటీకి రావాలని..అదీ కాకుంటే ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పోటీ చేయించాలని సవాల్ చేసారు. 2019 నుంచి రాష్ట్రంలో ఒకే జెండా..ఒకటే అజెండాగా పాలన సాగుతోందన్నారు. కుప్పం నుంచి కురుపాం దాకా... ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం దాకా మొత్తం జగన్ పేరు మార్మోగుతుందన్నారు. ప్రతీ మగవాడి విజయం వెనుక మహిళ ఉన్నట్లుగానే...జగన్ వెనుక విజయమ్మ...భారతమ్మ తో పాటుగా తమందరూ కూడా ఉన్నామని గుర్తుంచకోవాలని రోజా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications