సొమ్మసిల్లిన రోజా ఆస్పత్రికి: టిడిపి ధర్నా, ఉద్రిక్తత
చిత్తూరు: జిల్లాలోని పుత్తూరు పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోటాపోటీగా ధర్నాలు దిగారు. ఆందోళనలో రోజా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో పార్టీ కార్యకర్తలు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అంతకుముందు భారీగా ఇరువర్గాల వారు చేరుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
తెలుగుదేశం ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు బనాయిస్తోందని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. కాగా, దళితులను అవమానపర్చే విధంగా రోజా వ్యాఖ్యలు చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యర్తలు ఆందోళనకు దిగారు. రెండు పార్టీల నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు.
ఇది ఇలా ఉండగా, దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాకు వ్యతిరేకంగా పలు దళిత సంఘాల నేతలు జిల్లాలో ఆందోళనకు దిగారు. మదనపల్లి, చిత్తూరు, పుత్తూరు, తిరుపతిలలో దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. రోజాను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
కాగా, శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజాసమస్యలపై ఒక మహిళా ఎమ్మెల్యే ధర్నా చేస్తుంటే కనీసం ఒక్క అధికారి కూడా వచ్చి సమాధానం చెప్పకపోవడం దారుణమని, తామేమీ ఎస్సీ, ఎస్టీలం కాదు దగ్గరకి రండని ఆమె ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఆ వ్యాఖ్యలు వినగానే అక్కడే ఉన్న దళితులు, టీడీపీ నేతలు ఆగ్రహించారు. ఆమె ప్రసంగానికి అడ్డుతగిలి ‘రోజా డౌన్ డౌన్, దళిత ద్రోహి రోజా' అంటూ ఆగ్రహంగా నినాదాలు చేశారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి రోజాను వెళ్లనీయకుండా ఆమె వాహనాన్ని అడ్డుకుని క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు.