ఘోరం: టీడీపీ ఎమ్మెల్సీ కారు ఢీకొని ఓ సామాన్యుడి మృతి..
తక్కెళ్లపాడుకు చెందిన దారావత్ దేవ్లా అనే వ్యక్తిని శిల్పా కారు ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
విజయవాడ: ప్రజాప్రతినిధుల కాన్వాయ్ ఢీకొని సామాన్యులు మృతి చెందే ఘటనలు తరుచుగా పునరావృతం అవుతుండటం జనాలను కలవరపెడుతోంది. తాజాగా కృష్ణా జిల్లా గరికపాడు వద్ద టీడీపీ ఎమ్మెల్సీ కారు ఢీకొని ఓ సామాన్యుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి బుధవారం మధ్యాహ్నాం జిల్లాలోని గరికపాడు వైపు నుంచి తన కారులో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. తక్కెళ్లపాడుకు చెందిన దారావత్ దేవ్లా అనే వ్యక్తిని శిల్పా కారు ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటన తర్వాత ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి మరో కారులో అక్కడినుంచి వెళ్లిపోయారు.
అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకోగా.. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.