ఏపీలో మొబైల్ మటన్ మార్ట్ లు , జగన్ నిర్ణయంతో మాంసం మాఫియాకు చెక్, ఇంకో బెనిఫిట్ కూడా !!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారోగ్య రక్షణకు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి వైద్య సదుపాయాలు కల్పించడమే కాకుండా, ఆరోగ్యకర వాతావరణాన్ని, ఆరోగ్యకర ఆహారాన్ని అందించడానికి జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఏపీ సర్కార్ మటన్ మార్ట్ లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో చెడిపోయిన మాంసాన్ని, కుళ్ళిపోయిన మాంసాన్ని, ఇతర జంతువుల మాంసాన్ని మటన్ అని చెప్పి విక్రయించి ప్రజలను మోసం చేస్తున్న మాంసం మాఫియాకు చెక్ పెట్టనుంది.
ఏపీ, తెలంగాణా జలజగడం పరిష్కారం కాదా .. తాజాగా వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్ట్ లపై కొత్త పంచాయితీ
ఆరోగ్యకర మాంసం విక్రయాలకు నిర్ణయం .. మొబైల్ మటన్ మార్ట్ లకు శ్రీకారం
రాష్ట్రంలో మటన్ దుకాణాలు నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదని జగన్ సర్కార్ గుర్తించింది. ఎన్ని సార్లు దాడులు చేసినా మటన్ దుకాణాల నిర్వాహకుల తీరులో మార్పు లేకపోవడంతో ప్రజా ఆరోగ్య రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం నడుంబిగించింది. ఈ క్రమంలోనే మొబైల్ మటన్ దుకాణాలు అందుబాటులోకి తీసుకురావాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొబైల్ వాహనాల ద్వారా మటన్ మార్ట్ లను నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించింది.
మొబైల్ మటన్ మార్ట్ లలో ఏర్పాట్లు ఇలా
పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన గొర్రెలను, మేకలనుఎంపిక చేసి వాటిని కట్ చేయడానికి, వాటికి డ్రెస్సింగ్ చేయడానికి, ప్యాకేజ్ చేసి విక్రయించడానికి కావలసిన అన్ని రకాల వసతులను కల్పిస్తూ మొబైల్ వాహనాలు సిద్ధమవుతున్నాయి. ఈ వాహనాల్లో దాదాపు పది గొర్రెలను, మేకలను కట్ చేసి విక్రయించడానికి వీలుగా అందులో ఏర్పాట్లు ఉంటాయి. ఇక ప్రాసెసింగ్ చేసిన మాంసాన్ని నిల్వ చేయడానికి రిఫ్రిజిరేటర్ లను కూడా ఈ వాహనాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ వాహనాలలోనే గొర్రెల, మేకల వ్యర్థపదార్థాలను నిల్వ చేయడానికి ప్రత్యేకమైన డంపింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తారు.
ఒక్కో యూనిట్ కు 10 లక్షల ఖర్చు .. తొలివిడత 112 మంది లబ్ధిదారులకు శిక్షణ
మటన్ మార్ట్ లను నిర్వహించే మొబైల్ వాహనాల ఒక్కొక్క యూనిట్ కు 10 లక్షల రూపాయల అంచనా వ్యయం అవుతుందని భావిస్తున్నారు. తొలిదశలో గ్రేటర్ నగరాలు, నగరాలు, పట్టణ ప్రాంతాలలో ఈ మటన్ మార్ట్ లను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత మండల కేంద్రాలు పంచాయతీలలో మటన్ మార్ట్ లను ఏర్పాటు చేయనున్నారు. అయితే ముందుగా మటన్ మార్ట్ లను గ్రేటర్ నగరాలు, నగరాలు, పట్టణాలలో నిర్వహించడానికి 112 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి శిక్షణనిస్తారు. ఇక లబ్ధిదారులు ఎవరు ? వారికి ఎలా శిక్షణ ఇవ్వాలి అన్నదానిపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
కల్తీ మాంసం విక్రయించే మాంసం మాఫియాకు చెక్
సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మాంసాన్ని విక్రయించే విక్రయదారులకు, అపరిశుభ్ర వాతావరణంలో, అనారోగ్యకర మేకలను, గొర్రెలను ఇష్టారాజ్యంగా వధించి విక్రయాలు జరుపుతున్న వారికి, కుళ్లిపోయిన, పాడైపోయిన మాంసాన్ని విక్రయిస్తున్న వారికి చెక్ పెట్టినట్లు అవుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల క్రింద గొర్రెలు, మేకలు పెంపకానికి కొంత మంది లబ్ధిదారులకు ప్రభుత్వం గొర్రెలు, మేకలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. వారికి మేలు జరుగుతుంది.
గొర్రెలు, మేకల లబ్దిదారులకు మేలు
ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన వారి గొర్రెలు, మేకల నుండి ఉత్పత్తి అయ్యే మాంసాన్ని ప్రాసెసింగ్ చేసి ఎగుమతులు చేయడానికి ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధ ప్రాసెసింగ్ సంస్థ అయిన అల్లానాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ ద్వారా జరిగే ఎగుమతులు పోగా, మిగతా ఆరోగ్యకర మాంసాన్ని మటన్ మార్ట్ లలో విక్రయించడం ద్వారా ఆదాయం రావడమే కాకుండా, ప్రజారోగ్యాన్ని కాపాడడానికి కూడా వీలవుతుంది. ఇదే సమయం లో గొర్రెలు, మేకలు పొందిన లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుంది. ఈ క్రమంలో తాజాగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అన్న చర్చ జరుగుతుంది. చిన్నచిన్న విషయాలపై కూడా ప్రత్యేకమైన దృష్టిని జగన్ సర్కార్ సారిస్తుందని మటన్ మార్ట్ లు నిర్వహించాలన్న ఆలోచన ద్వారా వ్యక్తమవుతుంది.