జగన్ కాన్వాయ్ కారు ఘటన-బాధితుడికి విచారణ పేరుతో వేధింపులు-పోలీసులు,ఆర్టీఏ ఫోన్లు
ఏపీలో ఈ వారం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన సందర్బంగా తిరుమలకు వెళ్తున్న వేముల శ్రీను కుటుంబం నుంచి కారు లాక్కున్న ఘటన కలకలం రేపింది. జగన్ కాన్వాయ్ కోసం ఈ కారును ఆర్టీఏ అధికారులు బలవంతంగా లాక్కెళ్లారు. అయితే ఆ కారు లాక్కున్న ఘటన తర్వాత బాధ్యులపై సీఎంవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేసింది. అయినా ఇప్పటికీ ఆర్టీఏ నుంచి వేముల శ్రీను కుటుంబంపై వేధింపులు ఆగడం లేదు.
అనేక ఇబ్బందులు పడుతూ దైవ దర్శనం చేసుకుని ఎట్టకేలకు ఇల్లు చేరితే ఒంగోలు ఎస్పీ ఆఫీస్ నుంచి, ఆర్టీవో అధికారుల నుండి రెండు రోజులుగా విచారించాలంటూ ఒంగోలుకు రావాలని ఫోన్లు చేస్తున్నారని బాధితుడు వేముల శ్రీను వాపోయారు. దీనితో తనకూ తన కుటుంబ సభ్యులు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నామని ఆయన తెలిపారు. అర్ధరాత్రి అర్ధాంతరంగా కారు తీసుకుపోవడంతో తాము పడ్డ ఇబ్బంది, జరిగిన అన్యాయం గురించి వివరించామేకాని మేము ఎటువంటి ఫిర్యాదులు చేయలేదని, విచారణ పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
పేద కుటుంబానికి చెందిన తాము ఇటీవల స్వతహాగా వ్యాపారం ప్రారంభించామని ఈ సంఘటనతో వ్యాపారం కూడా చేసుకోలేని దుస్థితిలో ఉన్నామని శ్రిను ఆవేదన వ్యక్తం చేశారు. తాము రోడ్డుపాలు అయ్యామని ఆవేదన చెందితే ఆ కుటుంబాన్ని ఓదార్చి సహకరించాల్సిన ప్రభుత్వ అధికార యంత్రాంగం తమను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని వేడుకుంటున్నారు.పేద కుటుంబానికి చెందిన తాము, తమ అబ్బాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించి వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకునేందుకు వెళ్తుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ అధికారులు అడ్డుకొని కారు తీసుకు వెళ్లడంతో మా పిల్లలు పడ్డ బాధ పెద్దలు అర్థం చేసుకోవాలని రోదిస్తూ విన్నవించింది శ్రీను అమ్మ. జరిగిన అన్యాయాన్ని చెప్పినందుకు నా కొడుకుని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని, తమ కొడుకు కుటుంబాన్ని వదిలి వేయాలంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, ఉన్నతాధికారులను ఆ వృద్ధురాలు అయిన శ్రీను అమ్మ వేడుకుంటున్నారు..