ముగిసిన ఏపీ పరిషత్ పోరు- 50 శాతం పైగా పోలింగ్- కోర్టు తీర్పు తర్వాతే కౌంటింగ్
ఏపీలో ఇవాళ జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకూ సాగింది. మొత్తం మీద దాదాపు 50 శాతం పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఐదు గంటలకు క్యూలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు.
Recommended Video
ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నానానికి కాస్త ఊపందుకున్నా తిరిగి సాయంత్రానికి మందగించింది. పలు జిల్లాల్లో బ్యాలెట్ బాక్సుల సమస్యలు, ఏజెంట్ల మధ్య ఘర్షణలు, గ్రామాల ప్రజల పోలింగ్ బహిష్కరణ వంటి సమస్యలు తలెత్తాయి. అయితే అధికారులు సకాలంలో జోక్యం చేసుకుని పోలింగ్ జరిగేలా చూశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది.
రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కలిపి మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 2,44,71,002 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎల్లుండి జరగాల్సిన ఓట్ల లెక్కింపుకు బ్రేక్ పడింది. ప్రస్తుతం హైకోర్టులో ఉన్న కేసు విచారణ పూర్తయితే కానీ ఎన్నికల కౌంటింగ్పై స్ఫష్టత వచ్చే అవకాశం లేదు. దీంతో ఎన్నికల పోలింగ్ పూర్తయినా అభ్యర్ధులతో పాటు ఓటర్లు కూడా ఫలితాల కోసం మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిన పరిస్ధితి.