రాజధానుల ఆలస్యంతో వైసీపీకి చిక్కులు-విపక్షాల టార్గెట్-కౌంటర్ వ్యూహం అమలు ప్రారంభం
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ మొదలుపెట్టి రెండేళ్లు కావస్తోంది. అయినా ఇప్పటికీ వాటి భవిష్యత్తుపై ఎలాంటి క్లారిటీ లేదు. హైకోర్టులో చిక్కుకున్న మూడు రాజధానుల బిల్లుల్ని విడిపించే విషయంలో రాజధానుల్ని తెచ్చిన వైసీపీ ప్రభుత్వానికి క్లారిటీ లేకపోవడం, దీనిపై గంపెడాశలు పెట్టుకున్న సొంత పార్టీ నేతలు, ప్రజలు నిలదీస్తుండటంతో అధికార పార్టీకి ఏం చెప్పాలో తెలియడం లేదు. త్వరలో రాజధాని డైలాగ్ పాతదైపోవడం, ప్రభుత్వం తరఫు నుంచి కొత్త ప్రయత్నాలేవీ జరక్కపోవడంతో.. ఇదే అదనుగా విపక్షాలు రంగంలోకి దిగిపోతున్నాయి.
రాజధానుల ఆలస్యం
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ మొదలయ్యాక వైసీపీ ప్రభుత్వం చట్టసభలతో పాటు గవర్నర్ వద్ద దీనికి ఆమోదముద్ర వేయించుకుంది. అయినా న్యాయవ్యవస్ధ ఆమోదం పొందడంలో మాత్రం ఆలస్యమవుతోంది. రాజధానుల విభజనను వ్యతిరేకిస్తూ వందకు పైగా పిటిషన్లు దాఖలు కావడంతో వీటిపై హడావిడిగా నిర్ణయం తీసుకునేందుకు హైకోర్టు సిద్ధంగా లేదు. రాజధాని పిటిషన్లలో వేలాది మంది భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో హైకోర్టు దీనిపై సావధానంగా విచారణ చేపట్టాలని భావిస్తోంది. అందుకే తాజాగా విచారణకు వచ్చిన పిటిషన్లను సైతం నవంబర్ 15కు వాయిదా వేసేసింది. దీంతో నవంబర్ లో తిరిగి ప్రారంభమయ్యే విచారణ వచ్చే ఏడాది కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వైసీపీకి పెరుగుతున్న కష్టాలు
మూడు రాజధానుల ఆలస్యంతో వైసీపీకి అన్ని చోట్లా కష్టాలు పెరుగుతున్నాయి. అసలు రాజధాని అయిన అమరావతిలో తరలింపుల ఏర్పాట్లు, కొత్తగా అభివృద్ధి పనుల లేమితో అసంతృప్తి కనిపిస్తోంది. అదే సమయంలో విశాఖ, కర్నూల్లో కొత్త రాజధానులు ఆలస్యం అవుతుండటంతో జనంలో అసంతృప్తి పెరుగుతోంది. వస్తుందనుకున్న రాజధాని రాకపోవడంతో ఈ రెండు చోట్ల ప్రజలు వైసీపీపై అసహనంగా కనిపిస్తున్నారు. విశాఖలో అయితే తాజాగా తెరపైకి వస్తున్న వైజాగ్ స్టీల్, గంగవరం పోర్టు ప్రైవేటీకరణ వంటి కొత్త సమస్యలు వారిని మరింత చికాకు పెడుతున్నాయి. వాటి విషయంలోనూ వైసీపీ సర్కార్ ఏమీ చేయలేని పరిస్ధితి ఉండటంతో అంతిమంగా అధికార పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది.
టీడీపీలో మళ్లీ పెరుగుతున్న జోష్
గతంలో మూడు రాజధానుల ప్రకటన నేపథ్యంలో డీలా పడిన టీడీపీ ఇప్పుడు తాజా పరిణామాలతో జోష్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రాజధానుల విభజనపై వైసీపీ ఏమీ చేయలేని పరిస్ధితి ఉండటం, స్ధానికంగా పెరుగుతున్న ఒత్తిడితో వైసీపీ నేతలు పదే పదే త్వరలో రాజధాని డైలాగ్ ను వల్లె వేస్తుండటంతో రంగంలోకి దిగుతున్న టీడీపీ ఆ మేరకు ప్రజల్లో ఉన్న అనుమానాల్ని సొమ్ము చేసుకునే పనిలో పడింది. ఓవైపు రాజధానిని తెచ్చే సత్తా వైసీపీకి లేదని ప్రచారం చేస్తూనే మరోవైపు ఉన్న పరిశ్రమలు, సంస్ధల్ని కూడా వైసీపీ కాపాడలేకపోతుందనే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్తోంది. వైజాగ్ లో ఇందుకోసం ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక పేరుతో కొత్త సంస్ధను సైతం ఏర్పాటు చేసింది. దీంతో ఈ వ్యవహారం వైసీపీని ఇప్పుడు చికాకుపెడుతోంది.
వైసీపీ కౌంటర్ వ్యూహమిదే
మూడు రాజధానుల ప్రక్రియ అంతకంతకూ ఆలస్యమవుతున్న నేపథ్యంలో విపక్షాలు ఒత్తిడి పెంచుతుండటం వైసీపీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. దీంతో వైసీపీకి వెంటనే కౌంటర్ వ్యూహం అమల్లో పెట్టాల్సిన పరిస్దితి ఎదురవుతోంది. దీంతో రాజధానులు రాకముందే అక్కడ మౌలిక సదుపాయాలతో పాటు ఇతర కొత్త ప్రాజెక్టుల్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అదే సమయంలో రాజధానికి అనుకూలంగా విపక్ష నేత చంద్రబాబుతో ప్రకటన చేయించాలంటూ టీడీపీ నేతల్ని ఇరుకునపెడుతోంది. దీంతో చంద్రబాబు మరోసారి ఇరుకునపడటం ఖాయంగా కనిపిస్తోంది. మూడు రాజధానుల్లో ఏ ఒక్క దాన్ని సమర్దించినా మరో రెండు రాజధానుల నుంచి వ్యతిరేకత ఖాయం. దీంతో వైసీపీ కౌంటర్ వ్యూహం బాగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.
Recommended Video