విజయసాయిరెడ్డికి మరో ఝలక్-సింగిల్ బెంచ్ తీర్పుపై ఐకాయ్ అప్పీలు..!
ఏపీలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులకు కారణమైన ఆడిటింగ్ తప్పిదాలకు కారకుడిగా వృత్తిపరమైన దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయిరెడ్డిపై ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్డర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా క్రమశిక్షణా చర్యలకు సిద్దమైంది. దీనిపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సాయిరెడ్డికి సింగిల్ బెంచ్ కోర్టులో ఊరట లభించింది. అయితే ఇప్పుడు సింగిల్ బెంచ్ తీర్పుపై ఐసీఏఐ డివిజన్ బెంచ్ లో అప్పీలు చేసింది.
తన క్లయింట్ అయిన వైఎస్ జగన్ కు మేలు చేసేందుకు ఆస్తుల వ్యాల్యూయేషన్ ను మ్యానిప్యులేట్ చేశారని ఐసీఏఐ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై ఆయనపై విచారణ కోసం ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ ముందు హాజరు కావాలని గతేడాది అక్టోబర్ 23న ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ సాయిరెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి బెంచ్.. ఐసీఏఐ సాయిరెడ్డికి పంపిన నోటీసుల్ని ఈ ఏడాది జూలై 30న రద్దు చేసింది. దీనిపై ఐసీఏఐ ఇప్పుడు అప్పీలుకు వెళ్లింది.

సాయిరెడ్డికి తాము జారీ చేసిన నోటీసులు తెలంగాణ హైకోర్టు పరిధిలోకి రావంటూ తాము చేసిన వాదనను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదంటూ ఐసీఏఐ చెన్నై విభాగం తమ అప్పీలులో పేర్కొంది. సాయిరెడ్డి చెన్నై ఆఫీసు నుంచే అక్రమాలకు పాల్పడ్డారని, అలాగే ఐసీఏఐ ఆఫీసు కూడా చెన్నైలోనే ఉందని పేర్కొంది.
కాబట్టి ఇది మద్రాసు హైకోర్టు పరిధి అని తెలిపింది. అలాగే సాయిరెడ్డిపై విచారణ కూడా ప్రాథమిక దశలోనే ఉందని, ఇప్పటివరకూ ఆయనపై ఎలాంటి క్రమశిక్షణ చర్య తీసుకోలేదని వెల్లడించింది. అలాగే తమ నిర్ణయాలపై అప్పిలేట్ అథారిటీని కాదని హైకోర్టును ఆశ్రయించడాన్నీ తప్పుబట్టింది.దీనిపై త్వరలో తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది.












Click it and Unblock the Notifications