రాజ్యసభ: టిడిపిలో పోటాపోటీ, 'ఆరు'పై జగన్ పార్టీలోను
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తుంగతుర్తి నియోజకవర్గానికి ప్రత్యామ్నాయ అభ్యర్థులను కూడా ఆయన సిద్ధం చేశారు. తనకు రాజ్యసభ సీటునిస్తే తెలంగాణలో ఎస్సీలకు పెద్ద పీట వేసినట్లు అవుతుందని, ఎన్నికల్లో తాను తెలంగాణలో విస్తృత ప్రచారం చేయడానికి కూడా అది ఉపకరిస్తుందని పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు మోత్కుపల్లి చెబుతున్నారు. తెలంగాణలో పార్టీ ఒత్తిడికి గురైన పరిస్థితుల్లో తాను ముందుండి కెసిఆర్పై పోరాడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
సోమిరెడ్డి కూడా బాబును కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. పదవి ఉన్నా లేకపోయినా రెండు దశాబ్దాల నుంచి నెల్లూరు జిల్లాలో పార్టీ బరువు బాధ్యతలు తానే చూస్తున్నానని, తనకు అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తానని, రెడ్డి సామాజిక వర్గం నుంచి తాను తిరగడం ఎన్నికల్లో పార్టీకి ఎంతో కొంత ఉపయోగపడుతుందంటున్నారు. వీరితో పాటు గరికపాటి మోహన రావు, కంభంపాటి రామ్మోహన రావులు కూడా ఆశలు పెట్టుకున్నారు.
నారాయణ విద్యా సంస్ధల అధిపతి నారాయణ పేరు కూడా ఈసారి ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీకి వివిధ సందర్భాల్లో లోపాయికారిగా సహాయం చేసిన ఆయన ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా ఉన్న టిజి జనార్ధన రావు కూడా ఉన్నారు. కాగా, ఆరు రాజ్యసభ స్థానాలున్నాయి. వీటిలో కాంగ్రెసుకు మూడు, టిడిపికి రెండు స్థానాలు దక్కుతాయి.
మరోవైపు ఇటీకాలంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో కొందరు టిడిపి ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. రెండు రాజ్యసభ సీట్లు గెలవడానికి ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆ పార్టీకి సరిపోతుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కానీ ఆ పార్టీ వర్గాలు దీన్ని తేలిగ్గా కొట్టివేస్తున్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చేందుకు సీమాంధ్రలో చాలామంది సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.
ఆరో స్థానం కోసం జగన్ పార్టీ పోటీ పడుతుందా?
ఆరు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెసుకు మూడు, టిడిపికు రెండు దక్కనున్నాయి. ఆరో స్థానం కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఆ పార్టీకి 17 మంది సభ్యుల బలం ఉంది. మరో ఇరవై మంది వరకు మద్దతిస్తే ఆ పార్టీ ఓ అభ్యర్థిని గెలిపించుకునే అవకాశముంది. తెలంగాణ బిల్లు నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీలో చేరారు. ఇంకొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరందరితో పాటు ఇతరుల మద్దతు తీసుకుంటే ఓ అభ్యర్థిని గెలిపించుకునే అంశంపై జగన్ నేతలతో చర్చిస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరో అభ్యర్థి కోసం పోటీ పెడితే ఆ పార్టీలో పోటా పోటీ నెలకొంది. మైసూరా రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిలు రేసులో ఉన్నారు.