ఫరక్ పడదు: టి బిల్లుపై మోత్కుపల్లి, సెంటిమెంటుతో...
అంతకుముందు సభలో ఎర్రబెల్లి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దొంగ దీక్ష చేశారని ఆరోపించారు. తెలంగాణలో వెయ్యి మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం కెసిఆరేనని ఆరోపించారు. కెటిఆర్ వ్యాఖ్యాలపై ఎర్రబెల్లి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో వెయ్యు మంది చనిపోయారని పదే పదే అంటున్నారని, తెలంగాణ కోసం తెరాసకు చెందిన నాయకుడు ఒక్కరైనా చనిపోయారా? అని ప్రశ్నించారు.
కెసిఆర్ బూటకపు ఉద్యమాలు చేసి రెచ్చగొట్టడం వల్లె విద్యార్ధులు బలైపోయారన్నారు. తెలంగాణ ఇస్తే తెరాసను కాంగ్రెస్లో విలీనం చేస్తామన్న మాట నిజం కాదా అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఎలాంటి పదవులు తీసుకోనని కెసిఆర్ అన్న మాటలను గుర్తు చేశారు. ఆత్మహత్యలకు టిడిపికి ఏం సంబంధమన్నారు. అధికార మార్పిడిలో కెసిఆర్ ముందున్నారని, టిడిపి ఇరుప్రాంతాలలో సమన్యాయం కోరుకుంటుందే తప్ప తెలంగాణకు ఎప్పుడు వ్యతిరేకం కాదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
సెంటిమెంటుతో..
తెలంగాణ సెంటిమెంటు పేరుతో కెసిఆర్ పార్టీ పెట్టారని కొండ్రు మురళి అన్నారు. రాష్ట్రాల విభజన కోసం ఎక్కడా ఆత్మహత్య జరగలేదన్నారు. తెరాస నేతలు ప్రేరేపించారని ఆరోపించారు. పదవి రాలేదనే కెసిఆర్ పార్టీ పెట్టారన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని ద్రోణంరాజు అన్నారు. కనుమరుగు అవుతున్న తెలుగును కాపాడుకోవడానికి ఉద్యమం చేశామని, అందుకే ఎపి పుట్టుకు వచ్చిందన్నారు. బిల్లు సమైక్య స్ఫూర్తికి విరుద్దమన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత తమ పైన ఉందన్నారు.
బిల్లు పైన రెండు వందల రోజులైనా చర్చకు సిద్ధమని, అందరికీ అవకాశమివ్వాలని వంగీ గీత అన్నారు. కెటిఆర్ మట్టిబొమ్మలు అని మాట్లాడటం సరికాదని, అదే సమయంలో దానిని రాద్దాంతం చేయాల్సిన అవసరం కూడా లేదని గూండా మల్లేష్ అన్నారు. కెటిఆర్ చింతిస్తున్నామని చెబితే సరిపోయేదన్నారు. త్యాగాలు ఒకరివి, బోగాలు ఒకరివి అన్న చందంగా ఉందన్నారు.