తుగ్లక్ పాలన: కెసిఆర్పై మోత్కుపల్లి, రావణాసురుడన్న రేవంత్
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన వరంగల్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. పేదల గురించి ఆలోచించని ముఖ్యమంత్రి కెసిఆర్, వ్యాపారుల కోసం బిల్డింగులు కడతాడట అని ఎద్దేవా చేవారు. పిచ్చి తుగ్లక్లా కెసిఆర్ పాలన సాగుతుందని ఆరోపించారు.
ప్రజలు కెసిఆర్ను నమ్మరని అన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలను తగలబెట్టడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అంతుచూడాలని అన్నారు. బడుగుబలహీన వర్గాల కోసమే టిడిపి అని చెప్పారు. మాల, మాదిగలకు టిడిపి హయాంలోనే పదవులు వచ్చాయని అన్నారు. ఏపిలో చనిపోయిన రైతులకు పక్క రాష్ట్ర సిఎం చంద్రబాబునాయుడు రూ. 5లక్షల పరిహారం ఇచ్చారని చెప్పారు. తెలంగాణలో 600మంది రైతులు చనిపోతే ఒక్కరినీ పరామర్శించే తీరిక లేదా? అని సిఎం కెసిఆర్పై మండిపడ్డారు. ఏపి సిఎం సంక్రాంతి పండగనాడు పేదలకు సరుకులు కూడా అందించారని చెప్పారు.
తెలంగాణలో లక్ష కోట్ల మిగులు బట్జెట్ ఉంటే.. ఏపిలో 17వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని, అయినా చంద్రబాబు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారన్నారు. పాలకుడు మంచోడైతే పాలన బాగుంటుందని, దొంగోడైతే దొంగ పరిపాలన ఉంటుందని మోత్కుపల్లి అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలని అన్నారు. సంపన్నుల కోసమే కెసిఆర్ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. టిడిపిని లేకుండా చేస్తామంటున్నారని ఆరోపించారు.
అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేసి చూపించిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడుకే ఉందని, ఇక్కడ కూర్చొని మాట్లాడే హక్కు ఒక్క చంద్రబాబుకే ఉందని, దళితులను నమ్మించి మోసం చేసిన కేసీఆర్కు తెలంగాణ పాలించే హర్హత లేదని మోత్కుపల్లి చెప్పారు. పేద, బడుగు వర్గాలకు వ్యతిరేకమైన తెలంగాణ పార్టీని, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అంతు చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది బలయ్యారని, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, రాబోయే కాలంలో ప్రతి ఇంటికి ఉద్యోగంతోపాటు అన్ని సదుపాయాలు కల్పించే విధంగా టీడీపీ చర్యలు తీసుకుంటుందని మోత్కుపల్లి స్పష్టం చేశారు.
రైతుల కోసం, పేద, బడుకు, బలహీన వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం అన్ని వేళల పనిచేయగల శక్తి ఉన్న పార్టీ తమ పార్టీయేనని ఆయన అన్నారు. ఎమ్మార్పీఎస్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, దాంతో మాదిక కులం పైకి వచ్చిందని ఉమ్మడి రాష్ట్రంలో 25 మంది శాసనసభకు ఎన్నిక అయ్యారని ఆయన తెలిపారు. దళితుడిని సీఎం చేస్తానంటేనే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేశారని, కేసీఆర్ ధళితులను మోసం చేశారని మోత్కుపల్లి తీవ్రస్థాయిలో విమర్శించారు. మాదిగ జాతి నమ్మిన జాతి అని ఆయన అన్నారు. దళితులకు ఎన్టీఆర్ పెద్ద పీట వేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అందుచేత ఎమ్మార్పీఎస్ తమ్ముళ్లు ఆందోళన చెందనవసరం లేదని మోత్కుపల్లి అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం టీడీపీ పనిచేస్తుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
టిడిపిని కాపాడాలి: రేవంత్ రెడ్డి
వరంగల్ జిల్లా హన్మకొండలో హయగ్రీవాచారి మైదానంలో టిడిపి భారీ బహిరంగ సభలో టిడిపి నేత రేవంత్ రెడ్డి మాట్లాడారు. విడిపోతే చచ్చిపోతాం.. కలిసుంటే గెలుస్తామని ఆయన టిడిపి కార్యకర్తలకు చెప్పారు. టిడిపిని కాపాడాల్సిన బాధ్యత పార్టీ అధినేత చంద్రబాబుకే ఉందన్నారు. కేసీఆర్, హరీష్రావులు తమను పార్టీ మారాల్సిందిగా ప్రలోభపెట్టినా.. తాము తుది శ్వాస దాకా తెదేపా జెండా మోస్తామని చెప్పామని తెలిపారు.
తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు ముఖ్యపాత్ర వహించారని, అదే ఉస్మానియా వర్శిటీ నుంచే కేసీఆర్ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు. అలాంటిది ఈరోజున కేసీఆర్ ఓయూలోకి ఎందుకు వెళ్లలేకపొతున్నారని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్లు చదువులు వదిలేసి ఉద్యమంలో చేరారని రేవంత్రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తుందని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం తమ పార్టీలో చేర్చుకుంటుందని ఆయన అన్నారు. విడిపోతే చచ్చిపోతామని... కలిసి ఉంటే గెలుస్తామని.. ఐక్యతే మన బలమని ప్రతి టీడీపీ కార్యకర్త గుర్తుంచుకోవాలని కోరారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే టీఆర్ఎస్ను పడగొట్టే సత్తా టీడీపీకి ఉందని ఆయన అన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ ఆ హామీ ఏమైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగులలో ఏ ఒక్కరినైనా రిగ్యులరైజ్ చేశారా? అని ఆయన కేసీఆర్ను ప్రశ్నించారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఎవరికీ ఇవ్వకపోగా, కెసిఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయని రేవంత్రెడ్డి ఆరోపించారు. రైతుల కోసం అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న ఒక్క రైతును కూడా పరామర్శించలేదని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.
రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అయ్యేందుకు కేసీఆర్ మందు సీసా కాదని రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ రావణాసురుడు కాబట్టి హామీలు అమలు చేయకుంటే తల నరుక్కుంటానంటారని ఆయన విమర్శించారు. హామీలు ఇచ్చి మాట తప్పడం కేసీఆర్ నైజమని, బంగారు తెలంగాణ కాదు, రోల్డ్ గోల్డ్ తెలంగాణ కూడా రాలేదని ఆయన విమర్శించారు.. పాలన చేయాలని బండి పగ్గాలు అప్పగిస్తే, విరగ్గొట్టి బొంగరాలాట ఆడాలని కేసీఆర్ చూస్తున్నారని రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. మంత్రి వర్గంలో ఒక్క మహిళ కూడా లేదని ఆయన విమర్శించారు. దళితుడు అయిన రాజయ్యను కావాలనే మంత్రివర్గం నుంచి తప్పించారని.. కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని రేవంత్రెడ్డి అన్నారు.
మరో నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులైన కొండా దంపతులను టిఆర్ఎస్లో చేర్చుకోవడం దారుణమన్నారు. తెలంగాణ రైతుల కోసం ఏపి సిఎం చంద్రబాబుకు కెసిఆర్ ఒక లేఖ రాస్తే ఆయన విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ ద్రోహి కెసిఆర్.. భరత పట్టాలని అన్నారు.