అతని ఆస్తుల విలువ రూ. 25 కోట్లు: గోడ కూలి నలుగురు పిల్లలు మృతి
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి ఓ పెద్ద చేప చిక్కింది. విశాఖపట్నంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సంపత్రావు రమేష్ ఇంట్లో మంగళవారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.25 కోట్లు విలువచేసే అక్రమాస్తులను సంపత్రావు రమేష్ కలిగిఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.
1.1 కేజీల బంగారం, 2.5 కేజీల వెండి సహా కీలక పత్రాలు, ద్వారకనగర్లో 28 గదుల దినేష్ లాడ్జి, సెవెన్హిల్స్, మధురవాడ దగ్గర విలువైన ఇళ్లు కలిగి ఉన్నట్లు ఎసిబి సోదాల్లో తేలింది. దానికితోడు, శ్రీకాకుళం జిల్లాలో భారీ భవనం ఉన్నట్లు గుర్తించారు. 11 బృందాలతో బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ అనురాధ మీడియాకు తెలిపారు.
ఇదిలావుంటే, అకాల వర్షాల కారణంగా కడప జిల్లా సంబేపల్లి మండలం బోయపల్లిలో గోడకూలి నలుగురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారుల మృతితో బోయపల్లిలో గ్రామంతో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. వానలకు తడిసిన గోడ కూలి మీద పడడంతో వారు మరణించారు.
వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు. వరద తాకిడి ప్రాంతాల్లో అధికారులు అసలు కనిపించడం లేదని ఆయన అన్నారు.