బాబు ఒక్కసారి మాట్లాడారు: రేవంత్ ఇష్యూపై అవినాశ్, గుర్తు చేస్తున్నా: బుట్టా రేణుక
న్యూఢిల్లీ: ఈ పదిహేను నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెక్షన్ 8ను మినహాయించి ఏ విషయంలోను కేంద్రంపై ఒత్తిడి తేలేదని కడప ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జగన్ దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు.
మన రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా విభజించిందన్నారు. చంద్రబాబు ఈ పదిహేను నెలల కాలంలో కేంద్రం పైన ఒక్క దాని గురించి కూడా పోరాడలేదని చెప్పారు. ఆయన ఒక్క దాని గురించే ఆడిగారని, అది సెక్షన్ 8 గురించి అన్నారు.
ఓటుకు నోటు కేసులో తాను అడ్డంగా బుక్కు అయినప్పుడు చంద్రబాబుకు సెక్షన్ 8 గుర్తుకు వచ్చిందన్నారు. సెక్షన్ 8 గురించి తప్ప మరొకదాని గురించి అడగలేదని చెప్పారు. కేంద్ర ప్రాజెక్టులు, ఉక్కు పరిశ్రమ... ఇలా దేనిని తీసుకున్నా చంద్రబాబు అడగలేదన్నారు.
ప్రత్యేక హోదా గురించి ఒక్కో కేంద్రమంత్రి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒకరు ఏపీకి న్యాయం చేస్తామని, మరొకరు ప్రత్యేక హోదా ఇవ్వమని, ఇంకొకరు మరోవిధంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు వైసిపి పోరాడుతుందని చెప్పారు.
మేం గుర్తు చేస్తున్నా: బుట్టా రేణుక
రాష్ట్రాన్ని విభజించిన సమయంలో అధికార, ప్రతిపక్ష నాయకులు ఏపీకి ఇచ్చిన హామీని మర్చిపోయారని, ఇప్పుడు దానిని తాము గుర్తు చేస్తున్నా ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మండిపడ్డారు.
ప్రత్యేక హోదా హక్కును పోరాడి సాధించుకోవాలన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన రోజు బిజెపి, కాంగ్రెస్ పోటాపోటీగా హామీలిచ్చాయని, ఇప్పుడు ఆ హామీలను పక్కన బెట్టాయన్నారు. రాష్ట్రాన్ని ఇప్పుడు హీనస్థితిలో వదిలేశారన్నారు. ఇంకా ఎన్ని రోజులు మభ్యపెడతారో చెప్పాలన్నారు.
ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు అడుగుతాయని సాకులు చెబుతున్నారన్నారు. కానీ ఏ రాష్ట్రాన్ని ఇంత దారుణంగా విడగొట్టలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మేం సభలో మా గోడు చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
ఓట్ల గురించి గెంటేశారు: మేకపాటి
కాంగ్రెస్ పార్టీ నాడు ఓట్ల కోసం.. లోకసభలో ఏపీ ఎంపీలను గెంటివేసి బిల్లు తీసుకు వచ్చిందని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రాజ్యసభలో మాత్రం కాంగ్రెస్, బిజెపి పోటాపోటీ హామీలు ఇచ్చాయని చెప్పారు. హోదా కోసం నిన్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే తప్పకుండా అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీలో బిజెపి, కేంద్రంలో టిడిపి భాగస్వామిగా ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని చెప్పారు. హోదా లేకుంటే ఏపీ ప్రజలు చంద్రబాబు, బిజెపిని క్షమించరన్నారు.