ప్రజాగ్రహ సభ ఆరంభం మాత్రమే; సభ ప్రారంభానికి ముందే వైసీపీ, టీడీపీకి భయం: ఎంపీ సీఎం రమేష్
విజయవాడ వేదికగా బిజెపి, వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మంగళవారం నాడు ప్రజాగ్రహ సభను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో వైసిపి, టిడిపి నేతలు బీజేపీ సభను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జగనన్న నెట్వర్క్ లో ఏపీ బీజేపీ పనిచేస్తుందని పయ్యావుల కేశవ్ బీజేపీపై మండిపడ్డారు. రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన చేస్తున్నా, ఆలయాలపై దాడులు కొనసాగిస్తున్నా గట్టిగా ప్రశ్నించిన దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. బీజేపీకి బ్రాండ్ గా ఉన్న హిందుత్వ అంశాలపైన కూడా మౌనంగా ఉన్నారని బిజెపి నిర్వహించేది ప్రజాగ్రహ సభ కాదని, జగన్ అనుగ్రహ సభ అంటూ వ్యాఖ్యానించారు.
టీడీపీ, వైసీపీ నేతల కామెంట్లకు కారణం బీజేపీ సభ అంటే భయం
ఇక మంత్రి పేర్ని నాని, మంత్రి బొత్స తదితరులు కూడా బిజెపి సభపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీలను టార్గెట్ చేస్తూ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలు చేశారు. బిజెపి ప్రజాగ్రహ సభ అంటే వైసీపీ, టీడీపీ గుండెల్లో భయం పట్టుకుందని ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. పేర్ని నాని, పయ్యావుల కేశవ్ ల కామెంట్లు ఆ భయం నుండి వచ్చినవేనంటూ విమర్శలు గుప్పించారు. వైసిపిలో ఏం జరుగుతుందో పేర్నినాని ఆలోచించుకోవాలని, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో సహా కార్యకర్తలు, నేతలు జగన్ పై ఏం మాట్లాడుకుంటున్నారో పేర్ని నాని తెలుసుకోవాలని హితవు పలికారు.
వైసీపీలో అంతర్గత పోరు, నానీకి సభకంటే ముందే దడ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ఉందని ఎంపీ సీఎం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభ ప్రారంభం కాకముందే పేర్ని నానికి దడ మొదలైందని, అందుకే విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఈరోజు జరగనున్న సభలో పార్టీ అగ్రనేతలు ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తారని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. తాను మాట్లాడినా, సుజనా మాట్లాడినా కేంద్రం అనుకున్నవే చెబుతామని పేర్కొన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితులను టెలిస్కోపు పెట్టి చూస్తోందన్నది ముమ్మాటికీ వాస్తవమని వెల్లడించారు ఎంపీ సీఎం రమేష్.
ఏపీ ఉద్యోగులు కేంద్రం జోక్యం చేసుకోవాలని తనను అడుగుతున్నారు
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఫెయిల్ అయిందని విమర్శించారు. ఇక ఈ విషయాన్ని టిడిపి నాయకుడు పయ్యావుల కేశవ్ గమనించాలని తెలిపారు. ఇక ఇదే సమయంలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు ఎంపీ సీఎం రమేష్. పోలీసుల తీరుపై కేంద్రం దృష్టి సారించిందని, ఏపీ టెలిస్కోపు పెట్టి నిశితంగా పోలీసు అధికారుల పనితీరును పరిశీలిస్తోందని తాను వ్యాఖ్యలు చేసిన తర్వాత, చాలామంది ఏపీ అధికారులు తనకు ఫోన్ చేశారని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు. కేంద్రం జోక్యం చేసుకుంటే మంచిదని ఏపీ అధికారులే చెబుతున్నారు అంటూ అధికారులు కూడా వైసిపి పాలనలో పని చేయలేక పోతున్నారు అన్న విషయాన్ని పేర్కొన్నారు. రాష్ట్రంలో కక్ష సాధింపులు తప్ప ఇంకా ఏమీ లేదని చాలా మంది అధికారులు తనతో చెప్పారని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు.
రాజధానిగా అమరావతి .. ప్రజాగ్రహ సభ ఆరంభం మాత్రమే
వైసీపీ ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చామని రెండున్నరేళ్ల పాలనలో కూడా ప్రజలకు చేసిందేమీ లేదని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. ఇక ఈ రోజు జరగనున్న సభలో ఏం చెప్పబోతున్నామో చూడండి అంటూ సీఎం రమేష్ వైసీపీ నేతలను టార్గెట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. రాజధానిగా అమరావతి మాత్రమే కొనసాగుతుందని ఈ విషయాన్ని ఘంటాపధంగా చెబుతున్నానని సీఎం రమేష్ మరోమారు స్పష్టం చేశారు. ప్రజాగ్రహ సభ ఆరంభం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.