కారణం తెలియదు: ఏలూరు ఎంపీ మాగంటి బాబు గన్ మన్ ఆత్మహత్య
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (మాగంటి బాబు) వద్ద సుదీర్ఘ కాలంగా గన్మెన్గా కొనసాగుతున్న ఆదాం (45) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఏలూరు ఆర్మ్డ్ రిజర్వ్డ్ కానిస్టేబుల్గా ఉన్న ఆదాం చాలా ఏళ్లుగా మాగంటి బాబుకు గన్మన్గా కొనసాగుతున్నాడు. పార్లమెంటు శీతాకాల సమావేశాల కోసం మాగంటి బాబు ఢిల్లీకి వెళ్లగా, ఆదాం కాస్త రిలీఫ్ అయ్యాడు. ఈ క్రమంలో సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇది గమనించిన ఆయన కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స ప్రారంభమైన కొద్దిసేపటికే ఆదాం చనిపోయాడు. ఆదాం సతీమణి కూడా మహిళా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అయితే ఆదాం ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. మాగంటి బాబుకు గన్మన్గా వ్యవహరిస్తున్న ఆదాం ఆత్మహత్య సోమవారం జిల్లావ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, కుటుంబ కలహాలే ఆత్మహత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.