పుష్కరాలు: 'ముహూర్తం మంచిది కాదని అందుకే ఇంతటి ఘోర ప్రమాదం'
అమరావతి: రాజమండ్రి తొక్కిసలాటలో 27 మంది మృతి చెందడంపై శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం తన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎలాంటి అవాంతరాలు కలగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా పుష్కరాలను ఘనంగా నిర్వహించే క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నో ఏర్పాట్లు చేసినప్పటికీ 27 మంది మృత్యువాత పడటం ఆవేదన కలిగిస్తోందని అన్నారు.
చనిపోయిన 27 మందిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 10 మంది ఉండటంతో మరింత బాధాకరమని తెలిపారు. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాజమండ్రిలో ఉండి జిల్లాకు చెందిన మృత దేహాలను శ్రీకాకుళం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు నష్టపరిహారం ప్రకటించిందని, బాధితులను అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మీడియా సమావేశ అనంతరం ఆయన రాజమండ్రి వెళ్లారు.
మంచి ముహూర్తం కాదన్న ఉమ్మారెడ్డి
రాజమండ్రి పుష్కరాలకు నిర్ణయించిన ముహూర్తం మంచిది కాదని అందుకే ఇంతటి ఘోర ప్రమాదం జరిగిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పుష్కర పనులన్నీ చంద్రబాబు దగ్గరుండి చూశారని టీడీపీ ఎమ్మెల్యేలు, దేవాదాయ మంత్రి చెప్పారు.
కాబట్టి ఈ ప్రమాదానికి చంద్రబాబే కారణమన్నారు. ఆయన రాజీనామే అన్ని సమస్యలకు పరిష్కారమని తెలిపారు. పుష్కరాలు మంగళవారం ఉదయం 6.26 గంటలకు ప్రారంభమైతే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు 6.21కే స్నానం చేశారని పేర్కొన్నారు. ఈరోజు ఉదయం రాజమండ్రి కోటగుమ్మం పుష్కరఘాట్లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 29కు పెరిగింది.