ఏపీని మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఎలా: అంబేడ్కర్గా ఎంపీ శివప్రసాద్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూడాలని, కొత్త రాష్ట్రమైనందున మిగతా రాష్ట్రాలతో పోల్చడం సరికాదని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సోమవారం నాడు పార్లమెంటు ప్రాంగణంలో అన్నారు. శివప్రసాద్ ఈ రోజు ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వేషధారణలో వచ్చారు.
ఈ సందర్భంగా ఎంపీ శివప్రసాద్ మాట్లాడారు. అంబేడ్కర్ మాట్లాడినట్లుగా మాట్లాడారు. విభజనతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీని కేంద్రం ప్రత్యేకంగా చూడాలని చెప్పారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా చూస్తే ఎలా అని ప్రశ్నించారు.
నేను రాసిన రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటున్నారని, ఆపదలో ఉన్న రాష్ట్రానికి న్యాయం చేయాలన్నారు. ఆసుపత్రికి వెళ్తే ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో, ఎవరికి ట్రాప్ ప్రియారిటీ ఇవ్వాలో చూడాలన్నాుర. ఇబ్బందుల్లో ఉన్న ఏపీని కాపాడాలన్నారు.
ఏపీ కష్టాల్లో ఉందని, చంద్రబాబుకు కేంద్రం సహకరించాలన్నారు. నేను రాసిన రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరించారని, ప్రత్యేక హోదా కోసం సవరించవచ్చునని అభిప్రాయపడ్డారు. విభజన చట్టాన్ని సవరించి ఏపీకి న్యాయం చేయాలన్నారు.
అంబేడ్కర్ రూపంలో ప్రత్యేక హోదా అంశంపై నిరసన తెలపడంపై స్పందిస్తూ... తాను కళాకారుడిని అని, తనకు ఇలా నిరసన తెలిపే అవకాశముందని, తాను చెప్పే అంశాలు పెద్దలకు ఇలా చెబుతున్నానని, వారు ఆలోచిస్తారని భావిస్తున్నానని అన్నారు. విలేకరులు ప్రశ్నలు అడగ్గా.. తాను అంబేడ్కర్ వేషధారణలో ఉన్నానని, మిగతా వాటి గురించి మాట్లాడటం సరికాదని, మరోసారి వాటిపై మాట్లాడతానన్నారు.