నీడలతో యుద్ధానికి అలవాటు పడ్డాడు చంద్రబాబు ..గంటల దీక్ష గంట కొట్టడం అంటే ఇదే : సాయిరెడ్డి సెటైర్లు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. టీడీపీ నాయకులపై ఏమాత్రం అవకాశమున్నా ధ్వజమెత్తే విజయసాయిరెడ్డి తాజాగా చంద్రబాబు నిర్వహించిన సాధనా దీక్షపై సెటైర్లు వేశారు. చంద్రబాబు సాధన దీక్షలో ఎవరూ లేరని, కనీసం మీడియా కవరేజ్ కూడా లేదని పేర్కొన్న విజయసాయిరెడ్డి చంద్రబాబుకు పరాభవం జరిగిందంటూ ఎద్దేవా చేశారు.

అకటా.. ఏమిటీ దుస్థితి చంద్రబాబూ
గంటల దీక్ష గంట కొట్టడం అంటే ఇదే.. కనీసం గంటకు వంద మంది వచ్చి వెళ్ళినా మూడు వందల మంది హాజరయ్యారని చెప్పుకునే ఛాన్స్ ఉండేది. ఏమయ్యారు కార్యకర్తలు... ఎటు పోయారు నాయకులు అంటూ సెటైర్లు వేశారు. అకటా.. ఏమిటీ దుస్థితి . మన మీడియా లైవ్ వ్యాన్లు కూడా పెట్టినట్టు లేదే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎంత పరాభవం జరిగింది . బాబు ఆత్మ ఘోష పెట్టింది అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబు సాధన దీక్ష ను టార్గెట్ చేస్తూ విమర్శించారు.

దీక్షలను ఈవెంట్ల స్థాయికి దిగజార్చారు చంద్రబాబు
అంతే కాదు దీక్ష , సత్యాగ్రహం వంటివి ఎంతో నిబద్ధతతో చేపట్టాల్సిన గాంధేయ పద్ధతిలో సాగించే నిరసనలు అని పేర్కొన్నారు. అలాంటి దీక్షలను చంద్రబాబు భ్రష్టు పట్టించారని విమర్శించారు .ప్రచార ఆర్భాటాలతో బాబు వాటిని ఈవెంట్ల స్థాయికి దిగజార్చారని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో చిత్తశుద్ధిలేని శివపూజలాగే తయారయ్యాయి ఈ దీక్షలు అంటూ ఎద్దేవా చేశారు. మూడు గంటల సినిమాలా మూడు గంటల దీక్ష ఏమిటి బాబు .. మరీ అర్థం లేకుండా అంటూ చంద్రబాబు పై సెటైర్లు వేశారు.

నీడలతో యుద్ధం చేసి భ్రాంతిలో విజయం తనదే అనుకునే బాబు
సైరా పంచ్ వేసిన విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు అను'కుల' మీడియా లో సానుకూల వార్తలు చూసుకొని మురిసిపోతున్నారు అంటూ ధ్వజ మెత్తారు.
చంద్రబాబు నాయుడుకి వేరే కార్యక్రమం అంటూ ఏమీ లేదని తనకు సానుకూలంగా వార్తలు వస్తే వాటిని చూసి మురిసిపోతాడని విమర్శించారు. చంద్రబాబు నీడలతో యుద్ధానికి అలవాటు పడ్డాడని పేర్కొన్న విజయసాయిరెడ్డి, భ్రాంతితో కూడిన ఈ రణంలో గెలుపు తనదే అని మురిసిపోతుంటాడు. ప్రజలకు దూరమయ్యాక నువ్వేం చేస్తున్నావో ఎవరికీ పట్టదు బాబు అంటూ చంద్రబాబు నాయుడు పై పంచ్ వేసారు విజయసాయిరెడ్డి.

జగన్ సర్కార్ మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తుందన్న సాయిరెడ్డి
అంతేకాదు మరోపక్క జగన్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై, వివిధ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న విజయసాయిరెడ్డి తాజాగా మహిళా సాధికారత భద్రత జగన్ గారి తొలి ప్రాధాన్యత అంటూ మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై పోస్ట్ చేశారు. వైయస్ జగన్ మహిళా సాధికారతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని వారి భద్రతకు అంతే ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. అపాయంలో ఉన్న మహిళలకు సత్వరమే రక్షణ కల్పించేందుకు దిశ యాప్ రూపొందించారని పేర్కొన్న విజయసాయిరెడ్డి ఈ యాప్ లో బటన్ నొక్కగానే పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకొని రక్షణ కల్పిస్తారని తాను మాట్లాడిన ఒక వీడియోను పోస్ట్ చేశారు.

డాక్టర్స్ కు శుభాకాంక్షలు .. చంద్రబాబుకు మాత్రం సెటైర్లు
ఇదే సమయంలో ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన విజయసాయిరెడ్డి కరోనా విపత్తు వేళ తమ ప్రాణాలకు తెగించి ముందు వరుసలో నిలబడి నిస్వార్థ సేవలందిస్తున్న వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవం ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు అంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకపక్క ఏపీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై పొగుడుతూనే మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.












Click it and Unblock the Notifications