అందరూ కలిస్తే తప్ప జగన్ గారిని ఎదుర్కోలేరు; బాబు పరపతి ఎంత పలచబడిపోయిందో: సాయిరెడ్డి వ్యంగ్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న పొత్తుల రాజకీయాలపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. టిడిపి, జనసేనలు పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు టిడిపి, జనసేన పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పొత్తుల రాజకీయాలపై చంద్రబాబును టార్గెట్ చేశారు. జనంలో చంద్రబాబు పరపతి పడిపోయిందని, అందుకే పొత్తులకు వెళుతున్నాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మీ ఎత్తుగడలకు కాలం చెల్లింది: సాయిరెడ్డి వ్యాఖ్యలు
ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి ప్రజలకు ఏం చేస్తారో చెప్పి ఎన్నికలకు వెళ్లడం సర్వత్రా ఉన్న పద్ధతి అని పేర్కొన్నారు. పొత్తుల కోసం తెరవెనుక మంత్రాంగాలు నడిపే వ్యూహాలకు, జనం కేంద్రంగా లేని ఎత్తుగడలకు కాలం చెల్లిందని వ్యాఖ్యలు చేశారు. అబద్ధాన్ని 100సార్లు చెప్పి ప్రజలను వంచించిన గోబెల్స్ సాయంతో జర్మనీని 12 ఏళ్లు ఏలిన హిట్లర్ యుద్ధంలో గెలిచాడా? అంటూ ప్రశ్నించారు విజయ సాయి రెడ్డి.

ప్రజలకన్నా పచ్చ మీడియానే నమ్మే నీ డ్రామాలు జనం చూస్తున్నారు బాబూ!
తనకు బాకా ఊదే పచ్చ మీడియాలో చంద్రబాబు గంటలకొద్దీ సుత్తి కొడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. వారేమో ఆయనకు పూర్ణకుంభ స్వాగతాలు కలుపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకన్నా పచ్చ మీడియానే నమ్మే నీ డ్రామాలు జనం చూస్తున్నారు బాబూ! అంటూ హెచ్చరించారు.ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే వారు ఎన్టీఆర్. నీదేమో పచ్చ మీడియానే దేవాలయం, వాటి అధిపతులే ప్రభువులు అనే సిద్ధాంతం అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబుకు సహకరిస్తున్న పచ్చ మీడియాను, వాళ్లనే చంద్రబాబు నమ్ముకున్నారు అంటూ టార్గెట్ చేశారు.

ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి బాబుది
అందరూ కలిస్తే తప్ప జగన్ గారిని ఎదుర్కోలేం అన్న చంద్రబాబు పిలుపు చూస్తేనే ప్రజల్లో ఆయన పరపతి ఎంతగా పలచబడి పోయిందో తెలుస్తోంది అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఆయనేమో దీన్ని రాజకీయ పునరేకీకరణ అనే పరువు తక్కువ పేరుతో పిలుస్తాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎప్పుడో ఏదో చేశాననే స్టోరీలు తప్ప ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి బాబుది అంటూ విజయ సాయి రెడ్డి పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేదని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలహీన పడిపోయిందని వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుకు విలువల్లేని రాజకీయాలు కొత్తేమీ కాదు
ఇక అంతకు ముందు చంద్రబాబు ని టార్గెట్ చేసిన విజయ సాయి రెడ్డి తన ఎంపీలు ముగ్గురిని బీజేపీలోకి పంపాడు. చెలిమికి సై అని సైగలు చేశాడు. ప్రాధేయపడ్డాడు. కమలానికి కన్ను కొడుతూనే రాహుల్ పై మనసు పారేసుకున్నాడు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు విలువల్లేని రాజకీయాలు కొత్తేమీ కాదని పేర్కొన్నారు. ఇందిర మెప్పు కోసం మామగారి పైనే పోటీ చేస్తానని బీరాలు పలికి 'ఆఖరికి' ఆయన కాళ్లు పట్టుకున్నాడు చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు.

చంద్రబాబుకు బలిపశువు దొరకాలి అంతే!
అంతేకాదు కుక్క పని కుక్క, గాడిద పని గాడిదే చేయాలి అని పేర్కొన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. గార్దవం జాగిలంలా భ్రమపడితే పరిస్థితి ఏమవుతుందో చెప్పనక్కర్లేదు అంటూ వ్యాఖ్యానించారు. తిరస్కారాలు ఎదురైనా 'పిచ్చి' ముదిరిన స్వార్థజీవులు మారరు అని పేర్కొన్నారు. 'చిన్న సమూహం' తమ ప్రయోజనాల కోసం ఇంకొకరి భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తారు. బలిపశువు దొరకాలి అంతే! అంటూ చేసిన చంద్రబాబు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బలిపశువు అవుతారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications