వికేంద్రీకరణతో అమరావతికి నష్టం ఏం లేదన్న ఎంపీ విజయసాయి: అమరావతి భూములు అమ్ముతారా టీడీపీ ఫైర్ !!
వైయస్సార్ సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజధాని విషయంలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. రాజధాని వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధికి వచ్చిన నష్టమేమీ లేదని దీనివల్ల అమరావతి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ సమీక్ష చూస్తే ఆ విషయం అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు.ఇదే సమయంలో టీడీపీ నాయకులు పలు విమర్శలు చేస్తున్నారు.

రాజధాని అమరావతి విషయంలో బాబును టార్గెట్ చేసిన విజయసాయి
రాజధాని ప్రాంత రైతులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని చెప్పిన విజయసాయిరెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లకు మాత్రం ఎవరు హామీ ఇవ్వలేరు అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో సిఎం వైయస్ జగన్ 3 రాజధానుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. ఏఎంఆర్డీఏ పై ఆయన చేసిన సమీక్ష ఆయన నిబద్ధతకు నిదర్శనం. ధనార్జనే ధ్యేయంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన చంద్రబాబు మాదిరిగా కాకుండా, మన రాజధాని అనేది ప్రజలకు నిజంగా ప్రయోజనం చేకూర్చే ఒక ప్రదేశంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఏఎంఆర్డీయే సమీక్ష.. రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతుందన్న మంత్రులు
ఏపీసీఆర్డీయే రద్దు చేయబడి దాని స్థానంలో అమరావతి మెట్రో రీజియన్ డెవల్పమెంట్ అథారిటీ (ఏఎంఆర్డీయే)ఆవిర్భవించింది. తాజాగా ఏఎంఆర్డిఏ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వైసిపి నాయకులు,మంత్రులు రాజధాని అమరావతి నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేస్తామని ,సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమరావతి అభివృద్ధి చెందుతుందని చెప్పుకుంటున్నారు. అమరావతి రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగదని హామీలు గుప్పిస్తున్నారు. నిన్నటికి నిన్న బొత్సా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.

టీడీపీ విమర్శలు ... అమరావతి భూములు అమ్ముకోటానికేనా ?
ఇదే సమయంలోఈ సమీక్ష సమావేశంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టిడిపి నాయకులు సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని అమరావతి నిర్మాణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశం అమరావతి భూముల,మరియు నిర్మాణాల అమ్మకానికేనని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజారాజధానిగా ఎన్నికలకు ముందే అమరావతి సిఆర్డిఏ చట్టం జరిగిందని రెసిడెన్షియల్ ఫ్లాట్లు అమ్మడానికి మీకెవరు అధికారం ఇచ్చారంటూ దేవినేని ఉమ మండిపడ్డారు. జీవో ఇచ్చి రెండు నెలలు అవుతున్నా 186 కోట్ల రూపాయలను రైతులకు కౌలు ఇవ్వడానికి దానికి చేతులు ఎందుకు రావడం లేదంటూ ప్రశ్నించారు.రైతుల త్యాగంతో కూడిన భూములను, రెసిడెన్షియల్ ప్లాట్లను అమ్మడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు జగన్ అంటూ దేవినేని ఉమా ఏపీ సీఎం జగన్ ను ప్రశ్నించారు.
Recommended Video

అమరావతిపై సమీక్షలో కుట్ర అంటూ విమర్శలు
అంతేకాదు సిఆర్డిఎ రద్దు అంశం కోర్టులో ఉందని, రాజధాని వ్యవహారం పై కోర్టులో స్టేటస్ కో ఉందని, అలాంటప్పుడు అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సమీక్ష సీఎం జగన్ ఎలా చేస్తారని విమర్శిస్తున్నారు. అమరావతిపై సమీక్షలో కుట్ర జరిగింది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి భవనాన్ని ఎలా అమ్మాలి? అమరావతి భూములు ఎలా అమ్మాలి? అమరావతి పేరు మనుగడలో లేకుండా ఎలా చేయాలి అన్న దానిపైనే సీఎం జగన్ దృష్టి సారిస్తున్నారని టిడిపి నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications