'రంగా హత్యపై జోగయ్యే కరెక్ట్, హత్యా రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య'
అమరావతి: హత్యా రాజకీయాలు ఏపీ సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా హత్య విషయంలో మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఇప్పుడు ఏం చెప్పారో గతంలో కూడా అదే చెప్పారని ముద్రగడ అన్నారు.
పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని ముద్రగడ మండిపడ్డారు. స్వర్గీయ ఎన్టీఆర్ మానసికంగా చనిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు పాత్ర ఉందంటూ హరిరామ జోగయ్య తన 'అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం' పుస్తకంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ పుస్తకంలో వంగవీటి రంగా హత్యలో చంద్రబాబు హస్తం ఉందని ఆయన చెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు. దీంతో ఏపీలో ఇప్పుడు వంగవీటి రంగా హత్యపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. టిడిపి నేత బొండా ఉమ మంగళవారం మాట్లాడుతూ జోగయ్య విడుదల చేసిన పుస్తకంలో అసలు వాస్తవాలే లేవని వ్యాఖ్యానించారు.

వంగవీటి మోహన రంగా హత్య గురించి ముందే సమాచారం తెలిసివుంటే, ఆనాడు ఇదే హరిరామ జోగయ్య ఎందుకు అడ్డుకోలేదని ఆయన ప్రశ్నించారు. రంగా హత్యపై ఆధారాల్లేవని అప్పట్లో ఆయన కుటుంబమే అంగీకరించిందని, ఇప్పుడు జోగయ్య ఇలా ఎందుకు మాట్లాడారో అర్థం కావడం లేదని ఉమ అన్నారు.
మరోవైపు హరిరామ జోగయ్య రాసినది ఆత్మకథ కాదు, అబద్ధాల కథ అని కాపు సంఘం జాతీయ అధ్యక్షుడు రామానుజయ దుయ్యబట్టారు. ఆత్మకథైతే తన భార్య ఆత్మహత్యాయత్నం విషయాన్ని ఆయన ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు జోగయ్య ప్రయత్నిస్తున్నాడని, దీన్ని అడ్డుకుంటామని ఆయన అన్నారు.
మరోవైపు, ఒకరిద్దరు బిజెపి నేతలు మాత్రం చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి, బిజెపి నేత కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... జోగయ్య పుస్తకంలోని అంశాలపై చంద్రబాబు విచారణ జరిపించుకొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు పుస్తకం విడుదల కార్యక్రమానికి మాజీ కేంద్రమంత్రి, బిజెపి నేత పురంధేశ్వరి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications