"అలా చేసిన తొలి సీఎం కేసీఆరే, బాబులా తిట్టించడం, కోట్లు ఖర్చుపెట్టడం వద్దు"
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామిలను అమలు చేసిన దేశ తొలి సీఎం అని కేసీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారని ముద్రగడ ఆయన్ను ఆకాశానికెత్తేశారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ను అభినందిస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ చిత్తశుద్దిని ఆయన అభినందించారు. ఈ రెండు కమ్యూనిటీల రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేయించడం గొప్ప విషయమని అన్నారు.
తద్వారా ఎన్నికల మేనిఫెస్టో అంటే చిత్తు కాగితం కాదని దేశంలో మీరు మాత్రమే రుజువు చేశారంటూ కేసీఆర్ ను ముద్రగడ ప్రశంసించారు. గత ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను తక్కువ సమయంలో అమలు చేశారంటూ అభిప్రాయపడ్డారు.
ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఎటువంటి ధర్నాలు, రాస్తారోకోలు, వగైరా నిరసనలేవి లేకుండానే దీనిపై తీర్మానం చేయడం అభినందించదగ్గ విషయమని ముద్రగడ అన్నారు. గిరిజన, ముస్లిం సోదరుల రిజర్వేషన్ల కోసం రెండు కమిటీలు వేయడం, కమిటీ రిపోర్టు మేరకు అసెంబ్లీలో తీర్మానం పెట్టడం అంబేడ్కర్ బాటలో మీ ప్రయాణం సాగుతున్నట్లుగా అర్థమవుతోందని చెప్పారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామిలను అమలు చేసిన దేశ తొలి సీఎంగా కేసీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారని ముద్రగడ ఆయన్ను ఆకాశానికెత్తేశారు. ఇక ముందు కూడా డబ్బు నిర్వహణ భారం లేని ఎన్నికలు నిర్వహించాలని, తద్వారా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ముద్రగడ ఆకాంక్షించారు.
అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కూడా ముద్రగడ లేఖలో నిప్పులు చెరిగారు. రిజర్వేషన్లు ఇస్తానన్న హామిని పక్కనబెట్టి, దానిపై నిలదీసినందుకు తమను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా లాఠీచార్జీలు చేయించారని ఆరోపించారు. ఏపీలో సీఎం చంద్రబాబులా ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసే విధానం పాటించకండి అని కేసీఆర్కు సూచించారు.
మొత్తం మీద తాను రాసిన లేఖలో తెలంగాణ సీఎంను ఆకాశానికెత్తేసిన ముద్రగడ.. ఏపీ సీఎం చంద్రబాబును పరోక్షంగా టార్గెట్ చేసినట్లు అర్థమవుతోంది.