'అనంత'లో ముద్రగడ: నా వెనుక జగన్ లేరు, పవన్ మద్దతు కోరలేదు
అనంతపురం: కాపులను బీసీల్లో చేర్చాలని తాను చేస్తున్న ఉద్యమం వెనుక వైసీపీ అధినేత వైయస్ జగన్ హస్తం ఉందని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. అనంతపురం పర్యటనలో భాగంగా కాపు సంఘాల నేతలతో ఆయన ఆదివారం భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఉద్యమానికి మద్దతివ్వాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కోరలేదని ఆయన స్పష్టం చేశారు. తాను సలహాలు తీసుకునేంత స్థాయి జగన్కు లేదని ముద్రగడ వ్యాఖ్యానించారు.
టీడీపీ నేతలు దిగజారి మాట్లాడితే సహించేది లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాపులకు న్యాయం చేసేవారని ముద్రగడ అభిప్రాయపడ్డారు. కాపులకు ఏటా రూ. 1000 కోట్లు ఇస్తామన్నారు... ఆ హామీలు నెరవేర్చనందునే తాము ఉద్యమబాట పట్టినట్లు ఆయన వివరించారు.
జూన్లో కాపు ఉద్యమంలో మలిదశ ప్రారంభమవుతుందని అన్నారు. తనకు వ్యక్తిగత ఎజెండా లేదని... రాజకీయాలకు దూరం అని ఆయన వెల్లడించారు. తన వెనుక వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారన్నది అవాస్తవమన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఉద్యమం చేసినప్పుడు... తన వెనుక చంద్రబాబు ఉన్నారనుకోవాలా అని తనపై ఆరోపణలు గుప్పిస్తున్న టీడీపీ నేతలపై మండిపడ్డారు. కాపు ఉద్యమం అణచి వేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ముద్రగడ ఆరోపించారు. తుని ఘటనలో కాపులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు.
బ్రిటీష్ హయాంలోనే కాపులను బీసీల్లో చేర్చాలని చెబితే, ఇప్పటి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. తమ జాతివల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, అధికారం పొందిన టీడీపీ, ఇప్పుడు కాపులను పాక్ జాతీయుల మాదిరిగా చూస్తోందని ఆరోపించారు.
తక్షణం కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కాపులు బానిసలు, సంఘ విద్రోహ శక్తులు కాదని ఆయన స్పష్టం చేశారు.