మేమూ రోడ్డెక్కుతాం: బాబుకు టీడీపీ ఎంపీ షాక్, 'కాపులు ప్లేట్లపై గరిటెతో కొట్టాలి'
రాజమహేంద్రవరం: ఇప్పటికే కాపు నేత ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సొంత పార్టీ నేతలు కూడా శుక్రవారం నాడు షాకిచ్చారు. టిడిపి ఎంపీ, కాపు నేత అవంతి శ్రీనివాస్ సీఎం చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు.
కాపులను బీసీలలో చేర్చాలని అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే తాము కూడా ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. తాము ప్రభుత్వంలో ఉన్నందునే రోడ్డెక్కడం లేదని చెప్పారు.
కేసులు పెట్టవద్దు: దేవినేని నెహ్రూ
రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలును వెంటనే పునరుద్ధరించాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ డిమాండ్ చేశారు. రైలును తగులబెట్టిన వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. సంఘ విద్రోహ శక్తులను ఉపేక్షించవద్దన్నారు. కాపు సబకు హాజరైన వారి పైన కేసులు పెట్టవద్దని కోరారు.
ప్లేటుపై గరిటెతో కొట్టండి: ముద్రగడ
కాపులకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ముద్రగడ, ఆయన సతీమణి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన ఇంటిలో ఆయన దీక్ష చేస్తున్నారు. తన దీక్షకు సంఘీభావం తెలిపేందుకు ఇంటికి రావొద్దని, ఇళ్ల వద్దనే నిరసన తెలపాలని ఆయన సూచించారు. తన దీక్షకు మద్దతుగా మధ్యాహ్నం భోజనం మానేయాలని, ప్లేటుపై గరిటెతో కొట్టి నిరసన తెలపాలన్నారు. ఏపీలోని కాపుల ఇళ్లలో ప్లేట్ల పైన గరిటెలు నేడు నాట్యం ఆడనున్నాయి.య