ఏకం చేస్తున్న ముద్రగడ: దాసరి ఇంటికి చిరంజీవి, చేయి కలిపిన జగన్ పార్టీ
హైదరాబాద్: కాపులకు రిజర్వేషన్ల కోసం పోరుబాట పట్టిన కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తమ డిమాండ్లను సాధించుకునే క్రమంలో భాగ్యనగరంలో పలువురు నేతల మద్దతు కూడగడుతున్నారు. వివిధ రాజకీయ పక్షాలతో పాటు ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావును కూడా కలిశారు.
ముద్రగడకు బోండా షాక్: కాపు రిజర్వేషన్లపై రివర్స్!
తాజాగా, మంగళవారం నాడు కాపు ప్రముఖులు దాసరి నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ తదితరులు వచ్చారు.
కాపులకు రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబు ప్రభుత్వం వేసిన కమిషన్ గడువు మరో పది రోజుల్లో ముగియనుంది. కమిషన్ నివేదిక ఇవ్వకున్నా, దాని ప్రకారం ప్రభుత్వంలో కదలిక లేకున్నా ఏం చేయాలనే విషయమై కాపు నేతలు చర్చిస్తున్నారు. ఈ అంశంతో చంద్రబాబును చిక్కుల్లో పడేయాలని ఓ వైపు ముద్రగడ, మరోవైపు విపక్ష కాంగ్రెస్, వైసిపిలు ఎదురు చూస్తున్నాయి.
ముద్రగడ ఒంటరి కాదు: అంబటి
ముద్రగడ ఒంటరివాడు కాదని చెప్పడానికే దర్శకుడు దాసరి నివాసంలో సమావేశమయ్యామని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీని ముద్రగడ నెరవేర్చమంటున్నారన్నారు. దానిని ఆయన నెరవేర్చలేదు కనుకే ముద్రగడ పోరాడుతున్నారన్నారు.
దీనిపై భవిష్యత్ కార్యాచరణను ముద్రగడ ప్రకటిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో కాపు కీలక నేతలైన ముద్రగడతోపాటు దాసరి, చిరంజీవి, బొత్స, పల్లంరాజు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారన్నారు.
త్వరలో జిల్లా స్థాయి కాపు నేతలతో సమావేశం కానున్నామని, అనంతరం ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై చర్చిస్తున్నామన్నారు. వివరాలు త్వరలోనే ముద్రగడ ప్రకటిస్తారన్నారు. ముద్రగడ వెంటే కాపు సమాజం ఉందని ఈ సమావేశం ద్వారా తెలియజేశామన్నారు.