చిన్నమ్మకు ధన్యావాదాలు, కెసిఆర్ మోసకారి: నాగం
మహబూబ్నగర్: తెలంగాణ బిల్లు పెడితే తాము బేషరతుగా మద్దతు ఇస్తామని చిన్నమ్మ సుష్మా స్వరాజ్ యుపిఎ ప్రభుత్వానికి చెప్పారని, ఆ మేరకు సుష్మా స్వరాజ్ తెలంగాణ ఏర్పాటుకు పూనుకున్నారని, చిన్నమ్మకు ధన్యవాదాలు తెలపాలని మహబూబ్నగర్ లోకసభ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటైన నరేంద్ర మోడీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
తనను తెరాసలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అడిగారని, చిన్నా చితకా పార్టీలతో తెలంగాణ రాదని, బిజెపి వంటి జాతీయ పార్టీలతోనే వస్తుందని తాను కెసిఆర్కు ఆ రోజే చెప్పానని ఆయన అన్నారు. మోసకారి కెసిఆర్ అని రాహుల్ గాంధీ అన్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెసులో పార్టీ విలీనం చేస్తానని వెనక్కి తగ్గారని ఆయన కెసిఆర్ను ఉద్దేశించి అన్నారు. ముఖ్యమంత్రి కావాలని కెసిఆర్ అనుకుంటున్నారని, నువ్వు ముఖ్యమంత్రివి కాలేవని మనం చెప్పాలని ఆయన అన్నారు.
2004లో తెరాసతో కలిసి పోటీ చేసి గెలిచిన తర్వాత కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని ఆన అడిగారు. 2009లో తెలంగాణను ప్రకటించినప్పుడైనా తెలంగాణను ఇచ్చి ఉంటే 1100 బలిదానాలు జరిగి ఉండేవని కావని, వారు తెలంగాణను చూసి తరించిపోయేవారని ఆయన అన్నారు. 1969లో తూటాలకు కూడా భయపడకుండా తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు పార్టీ ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు.
తెలంగాణకు అనుకూలంగా బిజెపి 2006లో తీర్మానం చేసిందని, ఆ మేరకు తెలంగాణకు మద్దతు ఇచ్చిందని ఆయన చెప్పారు. బిజెపి మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చింది, మద్దతు ఇచ్చింది, తెలంగాణను తెచ్చింది బిజెపి అని ఆయన అన్నారు