అక్కినేని vs నందమూరి: బాలయ్యపై ఫైర్..!!
అమరావతి: ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ- మరో వివాదానికి తెర తీశారు. అలగాజనం అంటూ ఇదివరకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై పరోక్షంగా ఘాటు విమర్శలు చేసిన ఆయన ఇప్పుడిక అక్కినేని కుటుంబంపై కామెంట్స్ చేశారు. ఆ ఫ్యామిలీని కించపరిచేలా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కినేని నాగార్జున అభిమానులు బాలయ్యను ట్రోల్ చేస్తోన్నారు.
వంద కోట్ల క్లబ్ లో..
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వీరసింహా రెడ్డి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్నారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ కేరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 12వ తేదీన విడుదలైన వీరసింహారెడ్డి 100 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తోన్నాయి. విడుదలైన తొలి రోజే 54 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసిందీ మూవీ.
వీరసింహా రెడ్డి సక్సెస్ మీట్ లో..
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. బాలయ్య డ్యుయెల్ రోల్ చేశారు. శృతి హాసన్ హీరోయిన్. ఈ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో సక్సెస్ మీట్ ను నిర్వహించింది యూనిట్. బాలకృష్ణ, హనీరోజ్, యువ హీరోలు విష్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, హను రాఘవపూడి, శివ నిర్వాణ ముఖ్య అతిథులుగా హాజయ్యారు.
అక్కినేని కుటుంబంపై..
ఈ సక్సెస్ మీట్ లో బాలకృష్ణ ఫ్లోలో అన్నారో లేక.. ఉద్దేశపూరకంగా చెప్పారో గానీ.. అక్కినేని కుటుంబం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కినేని.. తొక్కినేని అంటూ మాట్లాడారు. తొలితరం దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు పేరును కూడా ప్రస్తావించారు. మా ఆర్టిస్టులు అంత నాకు మంచి టైమ్ పాస్, వేదాలు శాస్త్రాలు నాన్నగారు, ఆ రంగారావు ఈ రంగారావు, అక్కినేని తొక్కినేని.. ఇవన్నీ కూర్చొని మాట్లాడుకునేవాళ్లమని అన్నారు.
అక్కినేని వర్ధంతి నాడే..
అక్కినేని నాగేశ్వర రావు వర్ధంతి నాడే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2014 జనవరి 22వ తేదీన అక్కినేని కన్నుమూశారు. అదే రోజు అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి తొక్కినేని అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించడం పట్ల నాగార్జున అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు.
వైసీపీ ఫ్యాన్స్ కూడా..
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభిమానించే నటుడిగా అక్కినేని నాగార్జునకు గుర్తింపు ఉంది. గతంలో సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఆయన బాహటంగా జగన్ ప్రభుత్వానికి మద్దతు పలికారు. టికెట్ల రేట్లను తగ్గించడం పట్ల తనకెలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సినిమా పరిశ్రమ మొత్తం వ్యతిరేకించినప్పటికీ- నాగార్జున మాత్రం అండగా నిలిచారు. దీనితో వైసీపీ అభిమానులు కూడా బాలకృష్ణను ట్రోల్స్ చేస్తోన్నారు.